ఆంధ్ర ప్రదేశ్ లో దొంగలు పడ్డారని... వారు ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు.
గుంటూరు: ఆంధ్ర ప్రదేశ్ లో దొంగలు పడ్డారని... వారు ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. వైసిపి ప్రభుత్వ అండతో ఇసుక మాఫియా చెలరేగుతోందని... రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తోందని ఆరోపించారు. అవసరాలకు ఇసుక దొరకడం లేదని... బ్లాక్ లో మాత్రమే ఇసుక దొరుకుతోందని అన్నారు.
''ఒకప్పుడు రాజమండ్రిలో రెండు యూనిట్ల ఇసుక రూ. 2,600లకు ఇంటికి చేరేది. నేడు బ్లాక్ లో ఐదు యూనిట్ల ఇసుక రూ. 25,000 వేలకు కొనుక్కోవాల్సి వస్తోంది. ఆన్ లైన్ ఓపెన్ అయిన 5 నిమిషాల్లో క్లోజ్ అయ్యిందంటున్నారు. అవసరమైన వారికంటే బ్లాక్ లో అమ్ముకునే వారికే ఇసుకు దొరకుతోంది. ఇసుక మాఫియా కోట్లు దండుకుంటోంది. రేవుల నుంచి ఇసుకలో 50 శాతమే స్టాక్ పాయింట్లకు వెళ్తోంది. మిగిలింది బయటకు తరలించేస్తున్నారు'' అని ఆరోపించారు.
read more ఏపీలో మారనున్న ప్రభుత్వ బడుల రూపురేఖలు... ఇకపై ఇలా వుంటాయట...
''ముఖ్యమంత్రి గారేమో నీతి వాఖ్యలు చెబుతున్నారు. పది రోజుల్లో వరదలు వస్తే గోదావరిలో ఇసుక దొరకదు. మైనింగ్ మాఫియా రాష్ట్రాన్ని శాసిస్తోంది. భూముల సేకరణలో దోపిడీ చేస్తున్నారు. గ్రామానికి 20,30 కిలోమీటర్ల దూరంలో ఇళ్లు ఇస్తామంటున్నారు. లెవలింగ్ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు'' అని అన్నారు.
''నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో...అవినీతి, అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ చెప్పే మాటల్లో కూడా అంతే నీతి ఉంటుంది. పల్లపు భూముల్లో మెరకల పేరుతో వైసిపి దోపిడీ చేస్తున్నారు. గోదావరిలో నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో అడ్డంగా తవ్వేస్తున్నారు. వైసీపీలో అధిష్టానం నుంచి కింది స్థాయి వరకు రాష్ట్రాన్ని దోచేస్తున్నారు. అవినీతి పరాకాష్టకు చేరింది'' అని బుచ్చయ్యచౌదరి విరుచుకుపడ్డారు.