
మచిలీపట్నం : గంజాయి స్మగ్లింగ్ పై కృష్ణా జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న 22 మందిని అరెస్ట్ చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మత్తు పదార్థాల వినియోగించినా, విక్రయించినా, రవాణా చేసిన చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ జాషువా హెచ్చరించారు.
యువకుల ఆర్థిక అవసరాలను తీరుస్తూ గంజాయి దందాలోకి దించుతున్నారని కృష్ణా ఎస్పీ తెలిపారు.ఇలా క్రమక్రమంగా చెడు వ్యసనాలకు బానిసవుతున్న యువకులు మాదకద్రవ్యాలు, గంజాయిని ఇతర ప్రాంతాల నుండి ఎగుమతి చేసుకుని మరీ విక్రయిస్తున్నట్లు తమ విచారణలో తేలినట్లు తెలిపారు. చెడుమార్గాన్ని ఎంచుకుని నేరాల బాట పడుతూ పట్టుబడిన యువతకు కౌన్సెలింగ్ ఇచ్చి వారి ప్రవర్తనలో మార్పు వచ్చేలా చూస్తున్నామని ఎస్పీ జాషువా తెలిపారు.
తాజాగా కృష్ణా జిల్లాలోని ఐదు పోలీస్ స్టేషన్ల పరిధిలో పట్టుబడిన నిందితుల వివరాలను ఎస్పీ వెల్లడించారు. గంజాయి స్మగ్లింగ్ ముఠాలో ప్రధాన నిందితుడైన విశాఖపట్నంకు చెందిన కొండరపు లోవరాజు(25)ను రాబర్సన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో అరెస్ట్ చేసారు. అతడితో పాటు దారపురెడ్డి సాయికుమార్(25), తుంగల చందు(21), దాసరి ప్రజ్వల్ (21), డొక్కు కాటంరాజు శ్రీనివాసరావు (21), పవన్ కుమార్(20), నూలు సాయి(22) ని పోలీసులు అరెస్ట్ చేసారు.
Read More ఆర్టీసీ బస్సులో డ్రగ్స్ తరలింపు: విజయవాడలో 40 గ్రాముల ఎండీఎంఏ సీజ్
ఇక గూడూరు పోలీస్ స్టేషన్ పరిధిలో బలుపూరి కిషోర్(19), రవితేజ(20), అమృతలూరి దయాకర్(17)...గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలో బండి తంబి(25), కొండ రాకేష్(23), కాటూరి సుబ్రహ్మణ్యం(28), మహమ్మద్ అక్బర్ బాషా(22), పెనుమూడి చందు(23), మెక్ మిలన్(25) లు గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డారు.
వీడియో
ఆత్కూరు పోలీస్ స్టేషన్ నాగిరెడ్డి తరుణ్(22), చంద్రశేఖర్ రెడ్డి(27), లండ ప్రేమ్ కిరణ్(24), ఏపూరి బాబురావు(20)... పెనమలూరు పోలీస్ స్టేషన్ ఘట్టమనేని సాయిప్రసాద్(19),
గోరంట్ల కిరణ్(22) లు అరెస్టయ్యారు. ఇలా కృష్ణాజిల్లా వ్యాప్తంగా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న యువకులంతా 30 ఏళ్లలోపు వారు కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో మైనర్లు కూడా వుండటం మరింత ఆందోళనకరం.
ఉన్నత చదువులు చదువి ఇలాంటి నేరాల బాట పడుతూ యువత జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఎస్పీ జాషువా అన్నారు. తాజాగా పట్టుబడిన వారిలో ఇంజనీరింగ్ తో పాటు ఇతర డిగ్రీలు చదివినవారు వున్నారని అన్నారు. ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తూ డబ్బులు సరిపోక ఈజీగా డబ్బు సంపాదించాలని ఇలా నేరాల బాట పడుతున్నవారే ఎక్కువగా వుంటున్నారని అన్నారు. విద్యాలయాల పరిసరాలు, పట్టణాలు, గ్రామ శివారు ప్రాంతాల్లో మాధకద్రవ్యాల విక్రయం చేపడుతూ... స్వయంగా మత్తుపదార్థాలకు బానిసలై అల్లర్లకు పాల్పడుతున్నారని ఎస్పీ అన్నారు. కాబట్టి పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రుల పర్యవేక్షణ వుంచాలని ఎస్పీ సూచించారు.
నిషేధిత మత్తు పదార్థాలతో పట్టుబడితే 10 సంవత్సరాలు నుండి 20 సంవత్సరాల వరకు కఠిన జైలు శిక్షతో పాటు లక్ష రూపాయల వరకు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. చాలాసార్లు పట్టుబడినా ప్రవర్తనలో మార్పు రాకుండా స్మగ్లింగ్ ను కొనసాగిస్తే వారిపై పిడి యాక్ట్ అమలుచేస్తామని ఎస్పీ హెచ్చరించారు.