జనసేన కౌంటర్ కు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రీకౌంటర్ ఇచ్చారు.
అమరావతి: జనసేన కౌంటర్ కు తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ రీకౌంటర్ ఇచ్చారు. తాను నాలుగేళ్ల నుంచి దాదాపు 100 సార్లు స్పీచ్ ఇచ్చానని, అంటే సెంచరీ కొట్టానని ఆయన చెప్పుకున్నారు.
ప్రత్యేక హోదా కోసం తాము కేంద్ర ప్రభుత్వంపై, ప్రధానిపై యుద్ధం చేస్తూనే ఉన్నామని, మరి పవన్ కల్యాణ్ ప్రధానిపై ఎందుకు ఆధారపడుతున్నారో అని ప్రశ్నించారు. అసలు పవన్ కల్యాణ్ ఎవరితో ఫైట్ చేస్తున్నాడని అడిగారు.
తమ బ్యాటరీ గురించి చెప్పాలంటే... అవి ఎప్పుడూ ఫుల్ చార్జింగ్ తోనే ఉంటాయని, అవి ఎప్పటికీ అలాగే ఉంటాయని, నిజంగా అలాగే ఉంటాయని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ ట్విట్టర్ వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. "వన్ డే ఇంటర్నేషనల్ మ్యాచులా ఒక్కసారి లోకసభలో స్పెషల్ స్టేటస్ పై మాట్లాడి మౌనం పాటిస్తున్న గల్లా గారూ.. మీ మౌనం వెనక కారణం ఏమిటో రెండు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలుసు సార్.." అని వ్యాఖ్యానించింది.
"కౌత్త సినిమా. కథ - డైరెక్షన్ వంటి బ్యాటరీ డౌన్ అయిన మాటలు మానేసి... స్పెషల్ స్టేటస్ తెచ్చే మార్గాలను కాస్తా ఆలోచించండి మాస్టారు.." అని వ్యాఖ్యానించింది. ఈ మేరకు జనసేన ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది.
రెండు రోజుల క్రితం గల్లా జయదేవ్ తన ట్విటర్ పేజీలో చేసిన వ్యాఖ్యకు సమాధానంగా జనసేన ఆ ప్రెస్ నోట్ విడుదల చేసింది. "కొత్త సినిమా త్వరలో రిలీజ్ కాబోతుంది. జగన్ పవన్ టైటిల్ తో. రాబోతున్న ఈ చిత్రానికి కథ - దర్శకత్వం ప్రశాంత్ కిశోర్ అయితే మోడీ - షా ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ చిత్రం విడుదల అవుతుందని ఆయన అన్నారు.