పెనమలూరు సీటు జోగికి: టీడీపీలోకి కొలుసు పార్థసారథి?

By narsimha lodeFirst Published Jan 12, 2024, 11:36 AM IST
Highlights

పెనమలూరు అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌సీపీ టిక్కెట్టు మంత్రి జోగి రమేష్ కు దక్కింది.  ఇవాళ  చంద్రబాబుతో కొలుసు పార్థసారథి  భేటీ అయ్యే అవకాశం ఉంది.


అమరావతి:యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సీపీ)కి చెందిన పెనమలూరు ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి ఈ నెల  21న  తెలుగు దేశం పార్టీలో చేరే అవకాశం ఉంది.  పెనమలూరు  అసెంబ్లీ స్థానం నుండి వైఎస్ఆర్‌‌సీపీ టిక్కెట్టును మంత్రి జోగి రమేష్ కు  ఆ  పార్టీ నాయకత్వం కట్టబెట్టింది. పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి గత కొంతకాలంగా   వైఎస్ఆర్‌సీపీ నాయకత్వంపై  అసంతృప్తితో ఉన్నారు.  మంత్రి పదవి దక్కలేదని పార్థసారథి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 

also read:లావుకు మద్దతుగా జగన్ వద్దకు: మార్చొద్దని కోరుతున్న నలుగురు ఎమ్మెల్యేలు

Latest Videos

గత ఏడాది  డిసెంబర్ మాసంలో  వైఎస్ఆర్‌సీపీ బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన  సభలో  పార్థసారథి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి.  ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తనను గుర్తించలేదని  ఆయన  వ్యాఖ్యానించారు.ఈ వ్యాఖ్యలు పార్టీలో చర్చకు దారి తీశాయి.దీంతో  ఈ వ్యాఖ్యలపై  పార్థసారథి వివరణ కూడ ఇచ్చారు. ఈ పరిణామాల తర్వాత పార్థసారథితో  వైఎస్ఆర్‌సీపీ నేతలు  కూడ చర్చించారు.  వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డితో పాటు  ఆ పార్టీ నేతలు  కొందరు పార్థసారథితో చర్చించారు.  అయినా కూడ  పార్థసారథి  మాత్రం  వెనక్కు తగ్గలేదు.  పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వర్గీయుల్లో ప్రచారం సాగుతుంది. 

also read:ఓటమిపై పోస్ట్‌మార్టం: అసెంబ్లీ వారీగా సమీక్షించనున్న కేసీఆర్

వైఎస్ఆర్‌సీపీ నాయకత్వం ఈ నెల  11వ తేదీన రాత్రి ప్రకటించిన మూడో జాబితాలో  పార్థసారథికి చోటు దక్కలేదు. పెనమలూరు నుండి మంత్రి జోగి రమేష్ కు టిక్కెట్టు కేటాయించింది.  పార్థసారథి పార్టీని వీడేందుకు రంగం సిద్దం చేసుకున్నందుకే పెనమలూరు టిక్కెట్టు పార్థసారథికి కేటాయించలేదని వైఎస్ఆర్‌సీపీ వర్గాల్లో ప్రచారంలో ఉంది.   

పెనమలూరు ఎమ్మెల్యే  కొలుసు పార్థసారథి  ఇవాళ తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి  నారా లోకేష్ తో భేటీ కానున్నారని సమాచారం. ఈ నెల  18న పార్థసారథి తెలుగు దేశం పార్టీలో చేరుతారనే  ప్రచారం సాగింది. అయితే కొన్ని కారణాలతో  ఈ నెల  21న టీడీపీలో చేరాలని పార్థసారథి తన అనుయాయులకు  సంకేతాలు ఇచ్చినట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. 

also read:సంక్రాంతికి తెలుగు దేశం అభ్యర్థుల తొలి జాబితా: 25 మందికి చోటు

పెనమలూరు లేదా నూజివీడు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని  పార్థసారథి భావిస్తున్నారనే ప్రచారం సాగుతుంది.  పెనమలూరు నుండి పోటీ చేసేందుకు  పార్థసారథి  ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈ రెండు అసెంబ్లీ స్థానాలు కాకపోతే మచిలీపట్టణం ఎంపీగా  పార్థసారథిని  బరిలోకి దింపాలని తెలుగు దేశం పార్టీ భావిస్తుందనే ప్రచారం కూడ లేకపోలేదు. అయితే  ఈ విషయాలపై చంద్రబాబు, లోకేష్ లతో చర్చల సందర్భంగా స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

పెనమలూరు మాజీ ఎమ్మెల్యే, తెలుగు దేశం నేత బోడే ప్రసాద్ వర్గం గుర్రుగా ఉంది. పార్థసారథి పెనమలూరు నుండి పోటీ చేస్తే సహకరించబోమని బోడే ప్రసాద్  నిర్ణయించినట్టుగా చెబుతున్నారు. ఈ పరిణామం ప్రస్తుతం ఆసక్తిగా మారింది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  కొలుసు పార్థసారథి  మంత్రిగా కూడ పనిచేశారు. సుధీర్ఘ కాలం పాటు  పార్థసారథి  కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన  సమయంలో  కాంగ్రెస్ పార్టీని వీడి ఆయన  వైఎస్ఆర్‌సీపీలో చేరారు. 

click me!