
మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణపై సంచలన వ్యాఖ్యలు చేశారు టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నా టీడీపీలోకి వచ్చే అవకాశం లేదన్నారు. ఆయన జనసేనలోకి వెళ్లొచ్చన్నారు. కన్నా టీడీపీలోకి వస్తే ఏం చేయాలో తనకు తెలుసునని రాయపాటి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనను, చంద్రబాబును తిట్టిన తిట్లకు కన్నా లక్ష్మీనారాయణ ఏం సమాధానమిస్తారని సాంబశివరావు ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో కన్నా ప్రతాపం ఏంటో తెలుస్తుందని ఆయన సెటైర్లు వేశారు. జనసేనతో పొత్తు లేకున్నా టీడీపీకి ఎలాంటి ఇబ్బంది లేదని రాయపాటి ధీమా వ్యక్తం చేశారు.
ALso REad: 12 ఏళ్ల తర్వాత కన్నా,రాయపాటి మధ్య రాజీ: రాయపాటిపై పరువు నష్టం దావా వెనక్కి
ఇకపోతే.. గతంలో ఓ కేసుకు సంబంధించి గతేడాది నవంబర్లో కన్నా లక్ష్మీనారాయణ, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుల మధ్య రాజీ కుదరింది. రాయపాటి సాంబశివరావుపై దాఖలు చేసిన పరువు నష్టం దావాను వెనక్కు తీసుకుంటున్నట్టుగా కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించారు. అలాగే కన్నా లక్ష్మీనారాయణపై తాను చేసిన వ్యాఖ్యలను కూడా వెనక్కు తీసుకుంటున్నట్టుగా రాయపాటి సాంబశివరావు ప్రకటించారు. దీంతో 12 ఏళ్ల తర్వాత ఇద్దరి మధ్య కేసు పరిష్కారమైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్లోనే ఉన్న సమయంలో ఇద్దరు నేతలు స్థానిక రాజకీయాల నేపథ్యంలో పరస్పరం విమర్శలు చేసుకున్నారు.
అవినీతికి పాల్పడిన కన్నాను మంత్రివర్గం నుండి తప్పించాలని అప్పటి సీఎం రోశయ్యను రాయపాటి డిమాండ్ చేశారు. ఈ విషయమై ఎఐసీసీ చీఫ్ సోనియాగాంధీకి కూడ రాయపాటి సాంబశివరావు లేఖ రాశారు. రాయపాటి చేసిన అవినీతి ఆరోపణలతో కన్నా లక్ష్మీనారాయణ తరపు న్యాయవాది సంజీవరెడ్డి రాయపాటి సాంబశివరావుకు 2010 జూలై 21న లీగల్ నోటీసు పంపారు.అయతే ఈ నోటీసుకు రాయపాటి సాంబశివరావు సమాధానం ఇవ్వలేదు. దీంతో కన్నా లక్ష్మీ నారాయణ మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావుపై కోటి రూపాయాలకు పరువు నష్టం దావా వేశారు.
Also Read: తెలుగుదేశం పార్టీలోకి కన్నా లక్ష్మీనారాయణ?.. భవిష్యత్తు కార్యచరణపై క్లారిటీకి వచ్చేసినట్టేనా..!
ఇదిలావుండగా.. కన్నా లక్ష్మీనారాయణ గురువారం బీజేపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తన ముఖ్య అనుచరులు, శ్రేయాభిలాషులతో సంప్రదింపులు జరిపిన అనంతరం కన్నా లక్ష్మీనారాయణ తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించారు. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపారు. అయితే తన భవిష్యత్తు కార్యచరణ ఏమిటనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. తన అనుచరులతో పూర్తి స్థాయి సంప్రదింపులు జరిపిన తర్వాత నిర్ణయానికి ప్రకటించనున్నట్టుగా తెలిపారు.
అయితే కన్నా లక్ష్మీనారాయణ జనసేలో గానీ, టీడీపీలో గానీ చేరవచ్చని గత కొంతకాలంగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. జనసేనలో కీలక నేత నాదెండ్ల మనోహర్.. కన్నా లక్ష్మీనారాయణతో భేటీ కావడంతో ఆయన జనసేనకు దగ్గర అవుతున్నారనే ఊహగానాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నా లక్ష్మీనారాయణ తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో చేరే అవకాశం ఉంది. కొద్దిరోజుల క్రితం టీడీపీ నేతలతో కన్నా లక్ష్మీనారాయణ చర్చలు జరిపారని.. ఆ పార్టీలో చేరేందుకు ఆయన నిర్ణయం తీసుకున్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.