సామాజిక సేవ ముసుగులో రాజకీయాలు.. పవన్, లోకేష్‌ల కోసమే జీవోలుండవు : పేర్ని నాని

By Siva KodatiFirst Published Jan 3, 2023, 4:19 PM IST
Highlights

పవన్, లోకేష్‌ల కోసమే జీవోలు తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని . రాష్ట్రంలో సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు నాని కౌంటరిచ్చారు. 

రాష్ట్రంలో సభలు, సమావేశాలు, రోడ్ షోలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై విపక్షాలు మండిపడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవో ఏ పార్టీకైనా ఒకేలా వర్తిస్తుందన్నారు. పవన్, లోకేష్‌ల కోసమే జీవోలు తీసుకురావాల్సిన అవసరం లేదని పేర్ని నాని చురకలంటించారు. స్వచ్ఛంద సేవ ముసుగులో రాజకీయాలు చేశారని ఆయన ఆరోపించారు. 

అంతకుముందు వైసీపీ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జీవోలోని నిబంధనలు కొత్తేమీ కాదని.. గతంలో ఉన్నవేనని చెప్పారు. సజ్జల ఓ న్యూస్ చానల్‌తో మాట్లాడుతూ.. రోడ్ల మీద సభలు, ర్యాలీలు పెట్టడం బాగా జరిగినంత వరకు ఏమి ఉండదని.. కందుకూరులో జరిగిన తొక్కిసలాట ఘటన తర్వాత ప్రజల భద్రత గురించి ఆలోచన  చేయడం జరిగిందన్నారు. రోడ్లు మీటింగ్‌ల కోసం ఏర్పాటు చేసినవి కావని అన్నారు. సభలు జరిపేందుకు ప్రత్యామ్నాయాలు సూచించి.. రోడ్లను ప్రజల అవసరాల కోసం మాత్రమే వినియోగించుకునే మంచి ఉద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

ALso REad: 175 నియోజకవర్గాల పేర్లు తెలుసా... ‘‘సీఎం పవన్ కల్యాణ్’’ పేరుతో సినిమా తీస్తే ప్రొడ్యూస్ చేస్తా : గుడివాడ

జీవోలోని  నిబంధనలు ప్రతిపక్ష పార్టీలకే కాదు.. వైసీపీకి కూడా వర్తిస్తాయని అన్నారు. రాజకీయ పార్టీలు సభలు, సమావేశాలు అసలే నిర్వహించకూడదని అనలేదని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా గ్రౌండ్‌లలో నిర్వహించుకోవచ్చని తెలిపారు. వైసీపీ కూడా పోలీసులు, అధికారులు అనుమతి తీసుకుని సభలు పెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోను చీకటి జీవో అనడంలో అర్థం లేదన్నారు. అలా కాదని నిబంధనలు  ఉల్లంఘిస్తామమంటే చట్టం చూస్తూ ఊరుకోదని అన్నారు. బరితెగించి నిబంధనలు ఉల్లంఘిస్తే అందుకు తగిన పరిణామాలు కూడా ఎదుర్కొవాల్సి వస్తుందని చెప్పారు. రాజకీయంగా కుట్రలు చేయాల్సిన అవసరం వైసీపీకి లేదన్నారు. 

ఇకపోతే.. ఇక, ఇటీవల కందుకూరు, గుంటూరు తొక్కిసలాట ఘటనలతో రోడ్లపై సభలు, ర్యాలీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. జాతీయ, రాష్ట్ర, మున్సిపల్, పంచాయితీరాజ్ రోడ్లపై సభలు, ర్యాలీలపై నిషేధం విధిస్తున్నట్టుగా తెలిపింది. ప్రజలకు ఇబ్బందులు  లేని ప్రాంతాల్లోనే సభలు నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పోలీసు చట్టం, 1861 కింద జనవరి 2వ తేదీన హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఉత్తర్వులు జారీ చేశారు. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించడం వల్ల ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, వాటి నిర్వహణలో లోటుపాట్ల నేపథ్యంలో 30 పోలీస్ యాక్ట్‌ను అమలు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నారు

click me!