ట్రాన్స్ స్ట్రాయ్ కు బ్యాంకు భారీ షాకిచ్చింది. బకాయిపడ్డ రుణాన్ని తీర్చలేదన్న కారణంతో దేనా బ్యాంకు పోలవరం ప్రధాన కాంట్రాక్టర్ ట్రాన్స్ స్ట్రాయ్ కు చెందిన వాహనాలు, యంత్రాలను శుక్రవారం సీజ్ చేసింది. దేనా బ్యాంకు చేసిన పనితో కాంట్రాక్ట్ సంస్ధ యాజమాన్యానికి దిక్కు తోచటం లేదు. సంస్థ గతంలో తీసుకున్న రూ.87 కోట్ల రుణాన్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు యంత్రాలు, వాహనాలను సీజ్ చేసింది. వడ్డీతో సహా మొత్తం రూ. 120కోట్లు బకాయిపడడంతో పోలవరం వద్ద ఉన్న సంస్థ కార్యాలయానికి చేరుకున్న బ్యాంకు ప్రతినిధులు కోర్టు ఆదేశాలతోనే ఈ చర్య తీసుకున్నట్టు స్పష్టం చేశారు.
పోలవరం బిల్లులు ఆగిపోయి డబ్బు రొటేఫన్లో లేక దివాలా దిశగా పయనిస్తున్న ట్రాన్స్ట్రాయ్కు బ్యాంకు చర్య పెద్ద దెబ్బే. పోలవరం ప్రాజెక్టు హెడ్వర్క్స్(జలాశయం) పనులు దక్కించుకున్న ట్రాన్స్ట్రాయ్ చాలా కాలంగా రుణాలు చెల్లించటం లేదు. గతంలో ఇచ్చిన నోటీసులకు సంస్థ స్పందించపోవడంతో చివరకు బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా గతంలో కూడా రుణాలను (రూ.725 కోట్లు)చెల్లించాలని డిమాండ్ చేస్తూ ట్రాన్స్ట్రాయ్పై కెనరా బ్యాంకు నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్సీఎల్టీ)లో దివాలా పిటిషన్ వేసింది. టీడీపీ ఎంపీ రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ సంస్థ ఆర్థికంగా దివాలా తీసిందని, అందుకే రుణాన్ని తిరిగి చెల్లించడం లేదని సాక్షాత్తూ కెనరా బ్యాంకే పేర్కొనడం గమనార్హం.