
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బస చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12, 13, 14 తేదీల్లో చంద్రబాబు ఈ బస చేయనున్నారు. అయితే.. ఈ బస ఆయన బస్సులో చేయాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఈ మేరకు పార్టీ నాయకులు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఆయన బస్సులోనే ఎందుకు సభ చేస్తున్నారనే ప్రశ్న చాలా మందిలో మొదలైంది. దానికి కారణముందని పార్టీ నేతలు చెబుతున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో 24, 25, 26 తేదీల్లో కుప్పం పర్యటన సందర్భంగా ఆర్అండ్బీ గెస్ట్హౌసులో చంద్రబాబు బస చేశారు. 25న తెల్లవారుజామున 4నుంచి 5 గంటల వరకు.. ఉదయం 7.30 నుంచి 8.30గంటల వర కు గెస్ట్హౌసులో కరెంటు సరఫరా ఆపేశారు. తద్వారా ఆయన నిద్రకు, స్నానానికి ఇబ్బంది కలిగించారు.
ఉద్దేశపూర్వకంగా కరెంటును కట్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. దీంతో పాటు గదిని శుభ్రం చేయకపోవడం, బెడ్డు కింద బిర్యాని ముక్కలు, కప్బోర్డులో మందు బాటిళ్ల మూతలు ఉండటంతో అధికారులపై టీడీపీ నేతలు ఆగ్రహించారు. ఈ చేదు అనుభవాల దృష్ట్యా ఈసారి బస్సులోనే బస చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. ఆర్అండ్బీ గెస్ట్హౌస్ ఆవరణలో బస్సు ఆపి, అందులోనే నిద్ర, స్నానం, భోజనం చేస్తారు. నాయకులతో సమావేశాలను మాత్రం అతిథి గృహంలో నిర్వహిస్తారు.
కాగా, మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఖరారైంది. తొలిరోజు మధ్యాహ్నం కుప్పం ఆర్అండ్బీ గెస్ట్హౌస్ కు చేరుకుని.. 3.30గంటలకు బస్టాండులో బహిరంగ సభ.. సాయంత్రం 4.30 గంటలకు కుప్పం మాజీ సర్పంచ్ గోపినాథ్ ఇంటికెళ్లి ఆయన కుమారుడు, కోడలును ఆశీర్వదిస్తారు. అనంతరం ఇటీవల మృతి చెందిన కుప్పం మాజీ సర్పంచ్ దయాసాగర్ కుటుంబీకుల పరా మర్శ.. 5.15 గంటలకు కుప్పంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమావేశం ఉంటుందని చంద్రబాబు పీఏ మనోహర్ తెలిపారు.