
గుంటూరు : రోడ్లపై వెళుతుండగా, ఇంటిబయట వున్న మహిళలను టార్గెట్ గా చేసుకుని చెయిన్ స్నాచింగ్ లకు పాల్పడే దొంగలు ముదిరిపోయారు. ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి చొరబడి మరీ మహిళల మెడలోంచి బంగారం దొంగిలిస్తున్నారు. తాజాగా ఇంట్లో ఒంటరిగా వున్న మహిళ కళ్ళలో కారంచల్లి బంగారు గొలుసును లాక్కుని పరారయ్యారు కిలాడీ దొంగలు. ఈ ఘటన గుంటూరు జిల్లాలో చోటుచేసుకుంది.
బాధిత మహిళ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మంగళగిరి మండలం నపులూరు గ్రామానికి చెందిన చల్లా శ్రీదేవి ఇంట్లో ఒంటరిగా వుండగా ఇద్దరు దుండుగులు అద్దెకోసమంటూ వచ్చారు. ముందుగానే ఇంటి ముందువైపు తలుపులు పెట్టేసి వెనకవైపు నుండి ఇంట్లోకి ప్రవేశించారు దుండగులు. ఒకడు బైక్ స్టార్ట్ చేసుకుని వుండగా ఇంకొకడు ఇళ్లు అద్దెకిస్తారా అంటూ వచ్చాడు. ఇలా ఇంటి వెనకవైపు నుండి మాస్క్ పెట్టుకుని వచ్చినవాడు చూసి చూసేలోపే మహిళ కళ్లలో కారంకొట్టి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. బయట రెడీగా వున్న బైక్ ఎక్కి ఇద్దరు దొంగలు పరారయ్యారు.
వీడియో
కారం చల్లడంలో కళ్లమంటతో కిందపడిపోయిన తాను తేరుకునేలోపే ఇద్దరు దొంగలు పరారయ్యారని బాధితురాలు తెలిపింది. ఈ దొంగతనం సమయంలో తాను ఇంట్లో ఒంటరిగా వున్నానని... తన అరుపులు విని చుట్టుపక్కల ఇళ్లవారు వచ్చేసరికి దొంగలు పరారయ్యారని శ్రీదేవి తెలిపింది.
Read More రాయదుర్గం ఎస్బీఐలో నిధుల గోల్మాల్.. ఆడిట్ సమయంలో వెలుగుచూసిన వ్యవహారం..
సినీ పక్కీలో జరిగిన ఈ దొంగతనం గురించి తెలిసి స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. తాము పనులపై బయటకు వెళ్లగా రోజంతా మహిళలు ఇంట్లోనే వుంటారని... ఇలాంటి ఘటనల వల్ల వారి రక్షణపై ఆందోళన కలుగుతోందని స్థానికులు అంటున్నారు. వెంటనే ఈ దొంగలను పట్టుకుని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.
బాధిత మహిళ శ్రీదేవి భర్తతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి చెయిన్ స్నాచింగ్ పై ఫిర్యాదు చేసారు. వారి నుండి దొంగతనానికి సంబంధించిన వివరాలు సేకరించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.