కేంద్రానికి నిరసన లేఖలు

Published : Nov 14, 2016, 04:34 AM ISTUpdated : Mar 25, 2018, 11:53 PM IST
కేంద్రానికి నిరసన లేఖలు

సారాంశం

మూడు, నాలుగు రోజులు పూర్తయ్యేటప్పటికి బాహాటంగానే కేంద్రం నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు.

పెద్ద నోట్ల రద్దుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరి అజెండాతో వారు కేంద్రానికి లేఖలు రాయనున్నారు. మొత్తంమీద పెద్ద నోట్ల రద్దు విషయం మొత్తం దేశంలో లాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తోంది. రూ. 1000,రూ. 500 నోట్ల రద్దు ప్రకటన వెలువడిన మొదటి రెండు రోజులు ఇటు కెసిఆర్ అయినా అటు చంద్రబాబునాయడు అయినా పెదవి విప్పలేదు. రెండో రోజు మధ్యాహ్నం నుండి ప్రజల స్పందనను అంచనా వేసిన తర్వాత స్పందించారు.

  ప్రధానమంత్రి నరేంద్రమోడి ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వెలువడుతున్న నిరసనలను చూసిన తర్వాత మాత్రమే తాము కూడా సన్నాయి నొక్కులు మొదలుపెట్టారు. అదికూడా మూడు, నాలుగు రోజులు పూర్తయ్యేటప్పటికి బాహాటంగానే కేంద్రం నిర్ణయంపై వ్యతిరేకంగా మాట్లాడటం మొదలుపెట్టారు. చివరకు ఆదివారం ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలను, పరిష్కార మార్గాలపై కేంద్రానికి లేఖలు రాయాలని గట్టిగా నిర్ణయించటం గమనార్హం.

 పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెలువడగానే ప్రధాని తీసుకున్న నిర్ణయం వెనుక చంద్రబాబు సూచనే ఉందని తెలుగుదేశం పార్టీ నేతలు, టిడిపి భజన మీడియా బాకాలు ఊదాయి. అయితే, వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసిన కేంద్రం అవే స్ధానంలో సరికొత్త డిజైన్లో 2 వేలు, 500 రూపాయల నోట్లను తీసుకొస్తున్నట్లు ప్రకటించటంతో ఏ విధంగా  స్పందించాలో అర్దం కాలేదు. దాంతో రద్దు వెనుక చంద్రబాబు సూచన అన్న ప్రచారాన్నిపక్కన బెట్టారు. దానికి తోడు త్వరలో వెయ్యి రూపాయల నోట్లను కూడా తీసుకువస్తున్నట్లు జైట్లీ చేసిన ప్రకటనతో పెద్ద నోట్ల రద్దు వెనుక చంద్రబాబు సూచన ఏమీ లేదన్న విషయం అందరకీ అర్దమైంది.

  దాంతో పెద్ద నోట్లను రద్దు చేసిన కేంద్రం మళ్ళీ 2 వేల రూపాయల నోట్లను తీసుకురావటం ఎందుకంటూ చంద్రబాబు వాదన వినిపించటం మొదలుపెట్టారు. అదే విషయమై కేంద్రానికి త్వరలో ఒక లేఖ రాయనున్నట్లు కూడా ప్రకటించారు. పైగా 2 వేల రూపాయల నోట్ల చెలామణిపై చర్చ జరగాలని కూడా పిలుపునిచ్చారు. ఇక, కెసిఆర్ అయితే, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఏకపక్షంగా మండిపడ్దారు.

దేశ ఆర్ధికవ్యవస్ధను కుదిపేస్తున్న ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటపుడు ముఖ్యమంత్రులను సంప్రదించలేదని ధ్వజమెత్తారు. ఉన్నతాధికారుల సమీక్షలో కెసిఆర్ కేంద్రానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయటమే కాకుండా ఏకంగా గవర్నర్ ను కలిసి తన నిరసనను తెలిపినట్లు సమాచారం. అంతే కాకుండా పెద్ద నోట్ల రద్దు, తదనంతర పరిణమాలపై త్వరలో ప్రధానమంత్రిని కలిసి తన వాదనను వినిపించాలని కూడా కెసిఆర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

PREV
click me!

Recommended Stories

Srikakulam Collector సుడిగాలి పర్యటన.. పరుగులు పెట్టిన షాపుల యజమానులు | Asianet News Telugu
AP Food Commission Visits:ఫుడ్ కమిషనర్ ఆకస్మిక తనిఖీలు..డీలర్లకు కీలక ఆదేశాలు | Asianet News Telugu