ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన జరిగితే అలా ఎందుకు చేస్తారు: బాబును నిలదీసిన సోము వీర్రాజు

By Nagaraju TFirst Published Jan 30, 2019, 3:22 PM IST
Highlights


ఎన్టీఆర్‌ స్పూర్తితో పాలన జరిగిందని చెప్పడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన జరిగితే కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని నిలదీశారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ నరసింహాన్‌ అసత్యాలు ప్రసంగించారని మండిపడ్డారు. 


అమరావతి : తెలుగుదేశం పార్టీపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు నిప్పులు చెరిగారు. దివంగత సీఎం ఎన్టీఆర్ గొప్ప ఆశయాలతో పార్టీని స్థాపించారని చెప్పుకొచ్చారు. శాసనమండలి సమావేశాల్లో భాగంగా అమరావతిలో మీడియాతో మాట్లాడిన సోము గవర్నర్ నరసింహన్ ప్రసంగంపై మండిపడ్డారు. 

ఎన్టీఆర్‌ స్పూర్తితో పాలన జరిగిందని చెప్పడం బాధాకరమన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పాలన జరిగితే కాంగ్రెస్‌తో టీడీపీ ఎలా పొత్తుపెట్టుకుంటుందని నిలదీశారు. అసెంబ్లీ వేదికగా గవర్నర్‌ నరసింహాన్‌ అసత్యాలు ప్రసంగించారని మండిపడ్డారు. 

చంద్రబాబు బీసీ కులాలకు ఎక్కడ మేలు చేశారో చెప్పాలని సోము వీర్రాజు డిమాండ్ చేశారు. కాపులను బీసీల్లో చేరుస్తామన్నచంద్రబాబు ఇప్పటి వరకు ఎందుకు చేర్చలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. కేంద్రం చేసిన అభివృద్ధిని చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని ఆరోపించారు. 

కేంద్ర సాయం వల్లే రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందని, 24 గంటల విద్యుత్‌ సరఫరా కేంద్ర సహకారంతోనే సాధ్యమైందన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు మేలు చేసేందుకే ప్రభుత్వ ప్లాంట్‌లు మూసి ఉత్పత్తి నిలిపేశారని ధ్వజమెత్తారు. ఉపాధి హామీ నిధుల్లో వేల కోట్ల దుర్వినియోగం జరిగిందని ఆయన ఆరోపించారు. 

74 అంశాల్లో రాష్ట్రానికి కేంద్రం సహకరిస్తోందని, కేంద్రం సహకరించడం లేదనడం అవాస్తవమని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వనిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా పథకాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి వేల కోట్లు ఇస్తుంటే సహకరించడం లేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. 

ఉపాధిహామి పథకంలో భాగంగా రాష్ట్రానికి రూ. 9 వేల కోట్ల నిధులను ఇచ్చారని గుర్తు చేశారు. అభివృద్ధి పథకాల అమలులో కేంద్రం భాగస్వామ్యం ఉందని స్పష్టం చేశారు. చంద్రబాబు విడుదల చేసిన 10శ్వేత పత్రాలు అబద్దాలతో కూడుకున్నవని ఎమ్మెల్సీ సోము వీర్రాజు తెలిపారు. 

click me!