అసెంబ్లీని దెయ్యాలకొంపగా మార్చేశారు: గవర్నర్ ప్రసంగంపై ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

By Nagaraju TFirst Published Jan 30, 2019, 2:50 PM IST
Highlights

గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం అంతా అబద్ధాలమయమేనని విమర్శించారు. ఆ అసత్యాలు ప్రజలు వినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ ప్రసంగంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పించారని అయితే అసెంబ్లీ దెయ్యాల కొంపనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్‌ : అసెంబ్లీలో గర్నర్ నరసింహన్ ప్రసంగంపై వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సాక్షిగా గవర్నర్‌ చేత 40 పేజీల అబద్ధాలు చదివించారని ఆరోపించారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్‌ టీడీపీ అబద్ధాల కరపత్రం చదవడం దురదృష్టకరమన్నారు. 

గవర్నర్‌ నరసింహన్‌ ప్రసంగం అంతా అబద్ధాలమయమేనని విమర్శించారు. ఆ అసత్యాలు ప్రజలు వినాల్సి రావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడిన శ్రీకాంత్ రెడ్డి గవర్నర్‌ ప్రసంగంలో సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అని చెప్పించారని అయితే అసెంబ్లీ దెయ్యాల కొంపనా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

23 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి  రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కిన టీడీపీ ప్రభుత్వ తీరుతో అసెంబ్లీని దెయ్యాల కొంపగా భావించాల్సిన పరిస్థితి తెచ్చారని మండిపడ్డారు. స్పీకర్‌ పదవికి ఉన్న గౌరవాన్ని కోడెల శివప్రసాద్‌ కాలరాస్తున్నారని ఆరోపించారు. 

వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి ఆహ్వానించినా రావడం లేదని ఆయన దొంగమాటలు మాట్లాడుతున్నారని శ్రీకాంత్ రెడ్డి ధ్వజమెత్తారు. పార్టీ కండువాలు కప్పుకొని కోడెల టీడీపీ సభల్లో పాల్గొంటున్నారని దుయ్యబుట్టారు. రాష్ట్రాన్ని విభజించిన పార్టీ కాంగ్రెస్ అయితే విభజన హామీలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానిపై ఉందన్నారు. 

కానీ నాలుగేళ్లు ఎన్డీయేతో అధికారాన్ని పంచుకున్న చంద్రబాబు మళ్లీ ఇప్పుడు గవర్నర్‌ ప్రసంగంలో కేంద్రం రాష్ట్రానికి అన్యాయం చేసిందని చెప్పించడం దారుణమంటూ చెప్పుకొచ్చారు. జపాన్‌, సింగపూర్‌ తరహాలో రాష్ట్రం అభివృద్ధి చెందిందని గవర్నర్‌ ప్రసంగించడం బాధాకరమన్నారు. 

జాతీయ సగటు కన్నా ఏపీ వృద్ధి రేటు ఎక్కువని అన్నారు. 55 శాతం వృద్ధి పెరిగినట్లు పేర్కొన్నారు. నిజంగా వృద్ధి పెరిగినట్టు నిరూపించగలరా అని సవాల్‌ విసిరారు. మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలుగుదేశం పార్టీ  మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

పోస్ట్‌ డేటెడ్‌ చెక్కులు ఇచ్చి ప్రజల్ని మోసగించే ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తారు. 5 ఏళ్ల పాలనపై ప్రోగ్రెస్‌ రిపోర్టు తీసుకుని ఎన్నికలకు వెళ్లకుండా శ్వేత పత్రాలు, కొత్త హామీలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. చేతగాని ప్రభుత్వం చేతగాని బడ్జెట్‌ ​ప్రవేశపెడుతోందని ఘాటుగా విమర్శించారు.

 నాడు హంద్రీనీవా అవసరమే లేదన్న చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమండ్‌ చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే హంద్రీనీవా, గాలేరు పనులు జరిగాయని గుర్తుచేశారు. ఆ మహానేత చెమట చుక్కల ఫలితంగానే రాయలసీమకు నీళ్లొచ్చాయని అన్నారు. 

టీడీపీ నేతలు వైసీపీ సానుభూతి పరుల ఓట్లు తొలగించే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలే వైసీపీ ఎజెండా అయితే, చంద్రబాబు అజెండా మోసమేనని శ్రీకాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

click me!