భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులు రెచ్చిపోతున్నారు. ఒక ఎంఎల్సీ చంద్రబాబునాయుడుపైనే ఆరోపణలు చేస్తుంటే మరో ఎంఎల్ఏ ఏకంగా గవర్నర్ నే హెచ్చరించారు.
రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్పై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఫైర్ అయ్యారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గవర్నర్ నరసింహన్ హైదరాబాద్లో ఉన్నందున తెలంగాణ పట్ల ప్రేమ చూపుతున్నట్లు మండిపడ్డారు. నరసింహన్ ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ అయినప్పటికీ ఏపీ పట్ల వివక్ష చూపుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే చట్టసవరణ బిల్లును నెలరోజులుగా గవర్నర్ పెండింగ్ లో ఉంచుకోవటంపై అభ్యంతరం వ్యక్తం చేసారు.
తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ఇదే తరహా బిల్లును మూడు రోజుల్లో గవర్నర్ ఆమోదించిన విషయాన్ని ఆయన గుర్తు చేసారు. గవర్నర్ తీరు మారకపోతే కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని విష్ణుకుమార్ రాజు హెచ్చరించటం గమనార్హం.
నాలా చట్టం లేకపోవడం వల్ల ఏపీకి పరిశ్రమలు రావడం లేదని రాజు అభిప్రాయపడ్డారు. ఏపీలో నాలా పన్ను 9 నుంచి 3 శాతానికి తగ్గించాలని, ఏపీకి పెట్టుబడులు రావాలంటే నాలా చట్టం చాలా కీలకం కాబట్టి గవర్నర్ వెంటనే బిల్లును ఆమోదించాలని ఆయన డిమాండ్ చేసారు.