చంద్రబాబుపై అమిత్ షాకు భాజపా ఫిర్యాదు

Published : Aug 22, 2017, 09:26 AM ISTUpdated : Mar 26, 2018, 12:03 AM IST
చంద్రబాబుపై అమిత్ షాకు భాజపా ఫిర్యాదు

సారాంశం

నంద్యాల ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి మోసం చేసిన వైనాన్ని రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నంద్యాలలో ముస్లిం మైనారిటీల ఓట్ల కోసమే చంద్రబాబు భాజపా నేతలను దూరంగా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా? టిడిపి తమను మోసం చేసిందన్న భావనలో భాజపా నేతలున్నారు. అదే విషయాన్ని అమిత్ షాకు ఫిర్యాదు చేసారట.

చంద్రబాబునాయుడు వైఖరిపై భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఫిర్యాదులు వెళ్ళాయి. నంద్యాల ఉపఎన్నికలో ఎదురైన చేదు అనుభవంతో పాటు కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి మోసం చేసిన వైనాన్ని రాష్ట్ర నాయకులు, జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం. నంద్యాలలో ముస్లిం మైనారిటీల ఓట్ల కోసమే చంద్రబాబు భాజపా నేతలను దూరంగా పెట్టిన విషయం అందరికీ తెలిసిందే కదా?

నియోజకవర్గంలో మైనారిటీ ఓట్లు సుమారుగా 60 వేలదాకా ఉన్నాయి. భాజపా నేతలు గనుక టిటిడిపితో కలిసి ప్రచారం చేస్తే మైనారిటీ ఓట్లు ఎక్కడ దూరమవుతాయో అన్న ఉద్దేశ్యంతో భాజపా నేతలను దూరంగా పెట్టారు చంద్రబాబు. ఒకవేళ ప్రచారానికి రావాలనుకుంటే భాజపా కండువాతో కాకుండా టిడిపి కండువా వేసుకోవాలని షరుతు విధించటంతో కమలం నేతలు ప్రచారానికి దూరంగా ఉన్నారు.

నంద్యాలలో భాజపాకు సుమారు 10 వేల ఓట్లున్నాయ్. అయినా వారిని టిడిపి ప్రచారానికి వద్దనుకుందంటే ఆశ్చర్యంగానే ఉంది. మరి, ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా భాజపా నేతలు తమ ఓట్లను టిడిపికి వేయిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఇదే సమయంలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల ఘట్టానికి తెరలేచింది. రెండు పార్టీల మధ్యా అక్కడ ఇంకో రకమైన పేచి మొదలైంది. 48 వార్డుల్లో తమకు 26 వార్డులు కావాలని భాజపా పట్టుబట్టింది. 9 వార్డులు మాత్రమే ఇస్తామంటూ టిడిపి చెప్పింది. సరే, తెరవెనుక ఏం జరిగిందో ఏమో గానీ మొత్తానికి భాజపా 9 వార్డులకే సరేనంది.

అయితే, ముందు జాగ్రత్తగా రెండు పార్టీలు తమకు బలమున్న వార్డుల్లో నామినేషన్లు వేసారు. పొత్తు కుదిరిన తర్వాత భాజపా 9 వార్డులకన్నా అధికంగా నామినేషన్లు వేసిన వార్డుల్లో ఒక్కటి మినహా మిగిలిన నామినేషన్లను ఉపసంహరించుకున్నది. కానీ, టిడిపి మాత్రం భాజపాకిచ్చిన 9 వార్డుల్లోనూ నామినేషన్లు వేసింది కానీ ఉపసంహరించుకోలేదు. నామినేషన్ల ఉపసంహరణ కూడా పూర్తయిపోయింది.  

పోటీ నామినేషన్లు వేసిన వారు ఒత్తిళ్ళు వస్తాయన్న ఉద్దేశ్యంతో అందుబాటులో లేకుండా మాయమైపోయారు. దాంతో భాజపాతో పాటు టిడిపి అభ్యర్ధులు కూడా పోటీలో ఉన్నారు. దాంతో టిడిపి తమను మోసం చేసిందన్న భావనలో భాజపా నేతలున్నారు. అదే విషయాన్ని అమిత్ షాకు ఫిర్యాదు చేసారట.  ఈనెల 27-29 మధ్య అమిత్ షా విజయవాడలోనే ఉంటారు. అధ్యక్షుడి ముందు పంచాయితీ పెట్టాలని నేతలు అనుకుంటున్నారు. ఏమవుతుందో చూడాలి.

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather Update: రానున్న 24 గంటల్లో ఈ జిల్లాలకు వర్షాల హెచ్చరిక | Asianet News Telugu
Roja Selvamani Fires On Kirrak RP | Kirrak RP Mahanadu Speech | Asianet News Telugu