
నంద్యాల ఉపఎన్నికలో గెలపుకు ప్రధాన పార్టీలు నానా అవస్తలు పడుతున్నాయి. పోలింగ్ తేదీ దగ్గర పడేకొద్దీ ఎన్నికల సెగ బాగా ఎక్కువైపోతోంది. ఇది ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు పార్టీలు, అభ్యర్ధుల ప్రచారానికి సమాంతరంగా బెట్టింగుల జోరు పెరిగిపోతోంది. ఉపఎన్నికలో ఏ పార్టీ గెలుస్తుంది? ఇద్దరి అభ్యర్ధుల్లో ఎవరికి ఎన్ని ఓట్లు వస్తాయి? గెలిచే అభ్యర్ధికి వచ్చే మెజారిటీ ఎంత? అనే అంశాలపై బెట్టింగ్ రాయళ్ళ హడావుడి పెరిగిపోతోంది. ఉభయ గోదావరి జిల్లాలు, రాజధాని ప్రాంతాలైన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో బెట్టింగ్ హడావుడి బాగా ఎక్కువుంది.
ఈసారి గమనించాల్సిన విషయమేమిటంటే బెట్టింగుల్లోకి విదేశీయులు కూడా ఆశక్తి చూపుతుండటం. ఇప్పటి వరకూ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగానే విదేశాల్లోని బెట్టింగ్ రాయళ్ళ హడావుడి కనిపిస్తుంటుంది. కాకపోతే ఈసారి ఉపఎన్నికలోకి కూడా విదేశాల్లో ఉండేవారు దిగారు. పోయిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా గెలిచే అభ్యర్ధులు, పార్టీలపై బెట్టింగ్ జోరు సాగింది. మొదటిసారిగా ఓ ఉపఎన్నికలో బెట్టింగ్ జోరు పెరిగిపోతుండటం గమనార్హం. ఎన్నిక తేదీ దగ్గర పడేకొద్దీ బెట్టింగ్ మొత్తం పెరుగుతోంది.
వైసీపీ అభ్యర్ధి శిల్పా మోహన్ రెడ్డి గెలుపుపై కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రూ. 5 లక్షలపైనే బెట్టింగ్ జరుగుతున్నట్లు సమాచారం. మొదట్లో శిల్పా గెలుపుపై రూ. 1 లక్ష మాత్రమే ఉన్న బెట్టింగ్ తాజాగా రూ. 5 లక్షలకు చేరుకుంది. బెట్టింగ్ కాసే వాళ్లంతా నంద్యాలలోని తమ పార్టీ నేతలు, అభ్యర్ధులకు బాగా దగ్గరగా ఉండే నేతలు, పరిచయస్తుల ద్వారా సమాచారాన్ని సేకరించి మరీ బెట్టింగ్ లోకి దిగుతున్నారు. మరికొంతమంది మీడియాలోని సన్నిహితుల ద్వారా కూడా సమాచారాన్ని తెలుసుకుంటున్నారు.
23వ తేదీ పోలింగు దగ్గర పడేకొద్దీ బెట్టింగుల జోరు, మొత్తం పెరుగుతుండటం గమనార్హం. ఎన్నికలో గెలపుకు అభ్యర్ధులు, పార్టీలు నానా అవస్తలు పడుతుంటే వారిపై బెట్టింగులు కాసే వారు ఎక్కువైపోతున్నారు. చూసారా, ‘పిల్లికి చెలగాటం...ఎలుకకు ప్రాణసంకటం’ అంటే ఇదేనోమో.