ఈ సారి కూడా ఆంధ్రా అసెంబ్లీ చలికాలపు సమావేశాలు హైదరాబాద్ లోనేనా
అనుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ చలికాలపు సమావేశాలు వెలగపూడి తాత్కాలిక అసెంబ్లీలో జరిగేలా లేవు. ఎందుకంటే, అసెంబ్లీ,కౌన్సిల్ భవనాల నిర్మాణం పూర్తి కావస్తున్నా, సమావేశాలు జరుపుకునేందుకు ముస్తాబు కావడానికి మరొక రెండు మూడు నెలలయినా పడుతుందని అంటున్నారు. భవనాలలో ఇంటీరియర్ పనులింకా మొదలుకాలేదు. ఇవి పూర్తయ్యేందుకు కనీసం రెన్నెళ్లవసరం అంటున్నారు. అందువల్ల శీతాకాలంలో జరిగే రెండు మూడు రోజుల సమావేశాలను అక్కడ జరపడం కష్టమని, హైదరాబాద్ లోనే జరిపేద్దాం అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారని తెలిసింది.
మామూలుగా శీతాకాల సమావేశాలను కచ్చితంగా జరపాలనే నియమేమీ లేదు. అయితే, ఈ సారి జిఎస్ టి కి బిల్లుకు పార్లమెంటులో వచ్చిన సవరణలను అమోదించేందుకు సమావేశం జరపడం అవసరమని చెబుతున్నారు. దీనికోసం,కనీసం ఒక రోజో , రెండు రోజులో జరపాలి.
అందువల్ల హైదరాబాద్ వైపే ప్రభుత్వం మొగ్గు చూపుతున్నట్లు తెలిసింది. వేడిగా,వాడిగా గత వర్షాకాల సమావేశాలు హైదరాబాద్ లో ముగిశాయి. స్పీకర్ కోడెల మొదలుకుని, ముఖ్యమంత్రి నాయుడి దాకా అంతా అదే చివరి సమావేశమని, హైదరాబాద్ కు దాదాపు వీడ్కోలు చెప్పేశారు.
ఈ సమావేశాలు ఒక రోజు జరిగినా రెండ్రోజులు జరిగినా, వెడెక్కించేందుకు ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది.
అయితే, స్పీకర్ మాత్రం ఏది ఏమయిన ఆంధ్రలోనే సమావేశాలు జరపాలనే పట్టుదల తో ఉన్నారని, దీనికోసం అవసరమయే, అక్కడ ఉన్న యూనివర్శిటీలో ఒక దానిని వినియోగించుకోవచ్చని యోచిస్తున్నారని తెలిసింది.
లెక్క ప్రకారం డిసెంబర్ 15 నాటికి అసంబ్లీ, కౌన్సిల్ భవనాలు స్పీకర్ అధీనంలోకి రావాలి. అయితే, డిజైన్ల ఖరారు జాప్యం వల్ల టైంటేబిల్ తారుమారయింది. మరొకసమాచారం ప్రకారం, జిఎస్టి సవరణలను ఆమోదించడాన్ని జాప్యం చేసి, శీతాకాల సమావేశాలను రద్దు చేస్తే ఎలా వుంటుందున్న ప్రతిపాదన కూడదా పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది.