
ఏలూరులోని (eluru) రసాయన ఫ్యాక్టరీలో జరిగిన పేలుడులో (blast in chemical factory) తీవ్రంగా గాయపడి విజయవాడ ఆంధ్రా ఆసుపత్రిలో (andhra hospitals) చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఏపీ హోంమంత్రి (ap home minister) తానేటి వనిత (taneti vanitha) పరామర్శించారు. వారికి అందుతున్న చికిత్సకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వనిత మాట్లాడుతూ.. బాధితుల పరిస్ధితి విషమంగా వుందన్నారు.
ప్రమాదంపై నివేదిక వచ్చాక ఫ్యాక్టరీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని వనిత తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిన విషయాన్ని హోంమంత్రి గుర్తుచేశారు. ప్రభుత్వం రూ.25 లక్షలు, ఫ్యాక్టరీ యాజమాన్యం రూ.25 లక్షలు ప్రకటించిందని వనిత చెప్పారు. ఇక్కడ ఫ్యాక్టరీ వద్దని స్థానికులు అంటున్నారని.. ఘటనపై పూర్తి విచారణకు ఆదేశించామని మంత్రి తెలిపారు. అవసరమైతే ఫ్యాక్టరీని సీజ్ చేస్తాం అని తానేటి వనిత అన్నారు.
ఇకపోతే.. ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు ఘటన స్థలంలోనే సజీవ దహనం కాగా.. మరోకరు ఆస్పత్రి తరలిస్తుండగా మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏలూరు ఎస్పి, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఇక, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి జగన్ (ys jagan) రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.