
ఏలూరు జిల్లా పోరస్ కెమికల్ ఫ్యాక్టరీ అగ్ని ప్రమాద ఘటన విషాదకరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఈ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందారని తెలిసి ఆవేదన చెందినట్టుగా చెప్పారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది.
కష్టం మీద బతికే కార్మికుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో ఇచ్చిన విధంగానే పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో చనిపోయినవారికీ రూ.కోటి చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఒక్కో ప్రమాదానికి ఒక్కో తరహా పరిహారాన్ని ప్రకటించడం ఏమిటని అన్నారు.
ఈ ఘటనలో మరో 13 మంది తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని.. వారికి మెరుగైనవైద్యం అందించి న్యాయబద్ధంగా పరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నట్టుగా తెలిపారు. రసాయన కర్మాగారాల్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని.. భద్రత ప్రమాణాల నిర్వహణపై అధికార యంత్రాంగం ఎప్పటికప్పుడు పరిశీలన చేయాలని కోరారు. ఇటువంటి ప్రమాదాల నివారణకు కఠిన నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు.
ఇక, ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం రాత్రి ఫ్యాక్టరీలో ఒక్కసారిగా భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఐదుగురు ఘటన స్థలంలోనే సజీవ దహనం కాగా.. మరోకరు ఆస్పత్రి తరలిస్తుండగా మృతిచెందారు. మరో 13 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉంది.
అగ్ని ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీంతో అగ్ని ప్రమాదం జరిగిన కొంతసేపటి తర్వాత మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న ఏలూరు ఎస్పి, నూజివీడు డీఎస్పీ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ప్రమాదంలో గాయపడిన వారిని నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ఇక, ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల చొప్పున సీఎం జగన్ పరిహారం ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.