
పొత్తులకు సంబంధించి జనసేన (janasena) అధినేత పవన్ కల్యాణ్ (pawan kalyan) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. వివిధ పార్టీల నేతలపై దీనిపై స్పందిస్తున్నారు. తాజాగా వైసీపీ నేత, ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. ఎవరు.. ఎవరితో ఎన్ని పొత్తులు పెట్టుకున్నా వైసీపీని (ysrcp) ఓడించలేరని స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తిరుపతిలో (tirupati) బాలాజీ డైరీ ప్రాంగణంలో ఆదివారం ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ కు ఆయన సవాల్ విసిరారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసి గెలవాలన్నారు.
కులాలు, మతాల పేరు చెప్పుకొని ఓట్లడిగే పద్ధతిని దూరం పెట్టాలని నారాయణ స్వామి సూచించారు. కులం పేరు చెప్పుకొని ఓట్లడుగుతున్న పవన్ కల్యాణ్ ఒంటరిగా పోటీ చేసి తానేంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. పవన్ కల్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకుంటే తమకేంటని, పెట్టుకోకపోతే తమకేంటని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి సింహం అని, ఆయన్ను ఎవరూ ఏమీ చేయలేరని డిప్యూటీ సీఎం తేల్చి చెప్పారు.
ఇలా పొత్తుల విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి స్పందించారు. జనసేనతో బిజెపి పొత్తు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసారు. ఇదే విషయాన్ని నిన్న (శనివారం) తమ మిత్రపక్ష నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా స్పష్టంగా చెప్పారని అన్నారు. అయితే పొత్తు అంశంపై ఎలా వెళ్లాలనేది మాత్రం జాతీయ నాయకులు నిర్ణయిస్తారని పురంధేశ్వరి పేర్కొన్నారు. బిజెపి, జనసేన మధ్య గ్యాప్ ఉందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదన్నారు.
రాష్ట్ర బిజెపి నాయకత్వంతో జనసేన రాష్ట్ర నాయకులు మాట్లాడుతూనే ఉన్నారన్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం కొంత గ్యాప్ ఉన్నమాట నిజమేనన్నారు. కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ పెరిగిందంటూ పవన్ సరదా వ్యాఖ్యలను పురంధేశ్వరి గుర్తుచేసారు. సమన్వయంతో బిజెపి, జనసేన పార్టీ లు ముందుకు వెళుతున్నాయని... పొత్తుల విషయంలో తమ మధ్య ఎటువంటి విబేధాలు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసే ముందుకెళతామని పురంధేశ్వరి స్పష్టం చేసారు. ఆత్మకూరు ఉపఎన్నికల్లో అభ్యర్థిపై జనసేనతో చర్చించామన్నారు. ఇక్కడ బిజెపి అభ్యర్థే బరిలో వుంటాడని... అతడికి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు ఇస్తుందని పురంధేశ్వరి ప్రకటించారు.
ఇక వైసిపి ప్రభుత్వం స్థాయికి, పరిమితికి మించి అప్పులు చేస్తోందని పురంధేశ్వరి అన్నారు. రాష్ట్రంలో ఉన్న అరాచక పరిస్థితి వల్ల పెట్టుబడి పెట్టే అవకాశం లేదన్నారు. ఎనిమిదేళ్లు అయినా ఏపికి రాజధాని లేదన్నారు. ప్రజలు కూడా ఒక్కసారి ఆలోచించి తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నాని అన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీని అనేక రాష్ట్రాల సిఎంలు కలుస్తారు... అలాగే ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా కలిసారు... ఇందులో తప్పేముందని అన్నారు. ప్రధాని, ముఖ్యమంత్రి భేటి అయినంత మాత్రాన బిజెపి, వైసిపి ఒక్కటేనని దుష్ఫ్రచారం తగదని పురంధరేశ్వరి అన్నారు.