
పార్టీ పటిష్టతపై ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ దృష్టి పెట్టారు. దీనిలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనూ వాలంటీర్ వ్యవస్థను తీసుకురావాలని ఆయన నిర్ణయించారు. ప్రతి 50 ఇళ్లకూ ఒక పార్టీ ప్రతినిధి వుండేలా జగన్ రూపకల్పన చేశారు. అలాగే బూత్ లెవల్ కమిటీలు ఏర్పాటు చేసేలా సీఎం కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు జయహో బీసీ సభలో జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు.
అంతకుముందు విజయవాడలో బుధవారంనాడు నిర్వహించిన జయహో బీసీ మహాసభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తూ... సామాజిక న్యాయానికి తాము కట్టుబడి ఉన్నట్టుగా ఆయన వివరించారు. తమ ప్రభుత్వ ప్రతి అడుగులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తన మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 70 శాతం ప్రాతినిథ్యం కల్పించామన్నారు.ఐదుగురు డిప్యూటీ సీఎంలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలేనని సీఎం జగన్ చెప్పారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా అడుగులు వేసినట్టుగా జగన్ తెలిపారు. డీబీటీ, నాన్ డీబీటీ ద్వారా మూడున్నరఏళ్లలో రూ. 3.19 లక్షల కోట్లకు పైగా లబ్ది పొందారని సీఎం వివరించారు.
Also REad:2024 ఎన్నికలే చంద్రబాబుకు చివరి ఎన్నికలు: విజయవాడ జయహో బీసీ సభలో జగన్
చంద్రబాబునాయుడు 2014-19 కాలంలో ఏ ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపలేదన్నారు. తమ ప్రభుత్వం మూడున్నర ఏళ్లలో రాజ్యసభకు పంపిన ఎనిమిది మందిలో నలుగురు బీసీలేనని జగన్ గుర్తు చేశారు. సంక్షేమ పథకాల్లో పేద సామాజిక వర్గాలకే పెద్దపీట వేశామన్నారు.చంద్రబాబు పాలనలో అదే బడ్జెట్ తన పాలనలో అదే బడ్జెట్ అని జగన్ గుర్తు చేశారు. అప్పుల్లో పెరుగుదల రేటు చంద్రబాబు ప్రభుత్వంలో కన్నా ఇప్పుడే తక్కువగా ఉందని సీఎం జగన్ వివరించారు. చంద్రబాబు హయంలో పథకాలు ఎందుకు లేవో ప్రజలు ఆలోచించాలని ఆయన కోరారు. చంద్రబాబు సర్కార్ లో నలుగురు మాత్రమే బడ్జెట్ ను పంచుకొనేవారని జగన్ ఆరోపించారు.
దోచుకో.. పంచుకో.. తినుకో అనేదే చంద్రబాబు విధానమని జగన్ విమర్శించారు. అందుకే ఎలాంటి పథకాలను చంద్రబాబు తీసుకురాలేదని జగన్ విమర్శించారు. ఎస్సీల్లో ఎవరైనా పుడతారా అని చంద్రబాబు హేళన చేశారన్నారు. కానీ తాను మాత్రం కేబినెట్ లో 56 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ,మైనార్టీలకు స్థానం కల్పించినట్టుగా చెప్పారు. .మంత్రి వర్గ విస్తరణలో 70 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనారిటీలేనని ఆయన గుర్తు చేశారు. తన మంత్రివర్గంలో ఉన్న 25 మంది మంత్రుల్లో 11 మంది బీసీలే ఉన్నారని సీఎం వివరించారు.