నేడే ఏపీ బడ్జెట్: బుగ్గన ప్రస్తావించబోయే కీలకాంశాలు ఇవే...

By Sree sFirst Published Jun 16, 2020, 12:13 AM IST
Highlights

ఈసారి బడ్జెట్లో కూడా ఏపీ సర్కార్ మరోసారి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి కూడా రైతాంగానికి, వ్యవసాయానికి అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. గతేడాది 2,27,975 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఈసారి అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు కనబడుతోంది. 

ప్రత్యేక కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను కేవలం రెండు రోజులకే కుదించిన విషయం తెలిసిందే. నేడు మంగళవారం ఉదయం 10 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవనున్న విషయం తెలిసిందే!

ఉదయం 10 గంటలకు వర్చువల్‌ కాన్ఫరెన్సింగ్‌ ద్వారా గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగం పూర్తయిన తరువాత... 11:30 గంటలకు స్పీకర్‌ అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా మండలి (బిజినెస్ అడ్వైజరీ కౌన్సిల్- బీఏసీ) సమావేశం జరుగుతుంది. 

సమావేశం అనంతరం తిరిగి సభ ప్రారంభమవగానే గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం, దానిపై చర్చ, ముఖ్యమంత్రి సమాధానం ఉంటాయి. మధ్యాహ్నం 12:30 గంటల నుంచి 1 గంట మధ్యలో ప్రస్తుత వార్షిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టనున్నారు. ఆ తరువాత వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.  మండలిలో కూడా ఇదే మాదిరిగా బుడ్జెట్లను ప్రవేశ పెడతారు. 

శాసన సభలో సాధారణ బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, వ్యవసాయ బడ్జెట్‌ను వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు ప్రవేశపెట్టనున్నారు. శాసనమండలిలో సాధారణ బడ్జెట్‌ను డిప్యూటి సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెట్టనున్నట్టుగా తెలియవస్తుంది. 

ఈసారి బడ్జెట్లో కూడా ఏపీ సర్కార్ మరోసారి సంక్షేమ పథకాలకే పెద్దపీట వేయనున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ ని ప్రవేశపెట్టిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈసారి కూడా రైతాంగానికి, వ్యవసాయానికి అధికప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. గతేడాది 2,27,975 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెట్టగా ఈసారి అంతకన్నా ఎక్కువ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నట్టు కనబడుతోంది. 

బడ్జెట్లో ప్రధానంగా నవరత్నాల గురించిన ప్రస్తావన ఉండబోతుంది. సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా తమ సర్కార్ వేస్తున్న అడుగులను వివరించనున్నారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఆహార భద్రత కీలకాంశాలు కానున్నాయి. 

అభివృద్ధి, సంక్షేమపథకాలు మేళవింపుగా బడ్జెట్ ని తీర్చిదిద్దనున్నట్టు సమాచారం. పేదలకు భూముల పంపకం, కులాలవారీగా కార్పొరేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించనున్నట్టు తెలియవస్తుంది. 

పాలన ఒక సంవత్సరం పూర్తయింది కూడా కాబట్టి తమ ప్రభుత్వం తీసుకున్న అనేక సంక్షేమపథకాలను గురించి పేరుపేరునా ప్రస్తావించి, వాటి ప్రగతిని గురించి వివరించనున్నారు. ఇకపోతే ప్రతిపక్ష టీడీపీ ఏమో వైసీపీ సర్కారు చర్యలను అసెంబ్లీ వేదికగా ఎండగట్టాలని చూస్తుంది. చూడబోతుంటే... సమావేశాలు హాట్ హాట్ గానే జరిగేలా ఉన్నాయి. 

click me!