పవన్‌తో సోము వీర్రాజు భేటీ... తిరుపతి ఉప ఎన్నికపై కీలక చర్చ

By Siva KodatiFirst Published Jan 24, 2021, 7:24 PM IST
Highlights

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు కలిశారు. ఆదివారం సాయంత్రం అమరావతి నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఆయన పవన్ నివాసానికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా పవన్‌ను సత్కరించారు. అనంతరం ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు, తాజా పరిస్థితులపై ఇద్దరు నేతలు సుమారు అరగంటకు పైగా చర్చించారు. తిరుపతి ఉప ఎన్నికలపై కీలకంగా చర్చించారు.

ఎంపీ అభ్యర్ధిగా ఎవరినీ బరిలోకి దింపాలనే విషయంపై మాట్లాడారు. అనంతరం సోమువీర్రాజు మీడియాతో మాట్లాడుతూ.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలలో అభ్యర్ధిపై చర్చించామన్నారు.

‘ఏ పార్టీ నుంచి పోటీ చేసినా ఉభయ పార్టీల పార్టీల అభ్యర్ధిగా బరిలో దిగుతారని ఆయన సంకేతాలిచ్చారు. బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగుతారా..? లేకుంటే జనసేన నుంచి అభ్యర్ధి పోటీలో ఉంటారా..? అనేది మాకు ముఖ్యం కాదన్నారు.

ఉభయ పార్టీల అభ్యర్ధి విజయం సాధించే దిశగా ఈ సమావేశంలో ప్రణాళికలు సిద్దం చేశామని సోము వీర్రాజు తెలిపారు. 2024లో బీజేపీ, జనసేనలు సంయుక్తంగా అధికారంలోకి రావడమే లక్ష్యమని.. ఇందుకు తిరుపతి ఉప ఎన్నికనే పునాదిగా భావిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

ఇరు పార్టీల అధ్య ఎలాంటి సమన్వయ లోపం లేకుండా ముందుకు వెళ్లేలా ఆలోచన చేశామని.. కుల, మత వర్గాల బేధాలు లేకుండా అన్ని వర్గాల ఆకాంక్షల మేరకు కలిసి పయనిస్తామని వీర్రాజు వ్యాఖ్యానించారు.

కాగా, ఇటీవల తిరుపతిలో పవన్ పర్యటించినప్పుడు బీజేపీతో దోస్తీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికల్లో జనసేన, బీజేపీ నిబద్ధతతో, కలసికట్టుగా పోటీ చేసిన తీరులోనే తిరుపతి ఉప ఎన్నికల్లోనూ పోటీ చేయాల్సివుందని, అప్పుడే తమ కూటమికి విలువ వుంటుందంటూ వ్యాఖ్యానించారు.

కేంద్ర బీజేపీ నాయకత్వం ఇచ్చిన విలువ.. రాష్ట్ర పార్టీ నాయకత్వం జనసేనకు ఇవ్వడం లేదని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్ధితుల్లో సోము వీర్రాజు హైదరాబాద్‌కు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది.

click me!