
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు. జగన్ ఇంకా మూడేళ్ల పాటు సీఎంగా ఉంటారని తాను భావించడం లేదంటూ బాంబ్ పేల్చారు.
మరోవైపు.. కరోనా తీవ్రత నేపథ్యంలో రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ పెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు విష్ణుకుమార్ రాజు. భవనాలు కూల్చివేత, చిన్న చిన్న షాపుల తొలగింపు మీద ఉన్న శ్రద్ధ, అధికార యంత్రాంగానికి కరోనా వైరస్ నియంత్రపై లేదని ఆయన ఎద్దేవా చేశారు.
కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడం ఎంత వరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏపీలో రాత్రి కర్ఫ్యూ తుగ్లక్ చర్య అంటూ విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు.
Also Read:జగన్కు షాక్: బెయిల్ రద్దు పిటిషన్ను స్వీకరించిన సీబీఐ కోర్ట్.. రఘురామ హ్యాపీ
వైరస్తో అల్లాడుతున్న విశాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి మందుల కొరత లేకుండా చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోగుల మందులపై 3 నెలల పాటు జీఎస్టీ లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చూడాలని విష్ణుకుమార్ రాజు డిమాండ్ చేశారు.
జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు దాఖలు చేసిన పిటిషన్ను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిన సంగతి తెలిసిందే. ఆ కొద్దిసేపటికే విష్ణుకుమార్ రాజు ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.