అలా చేసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు: జగన్ పై చంద్రబాబు ఫైర్

By Nagaraju penumalaFirst Published Dec 12, 2019, 10:53 AM IST
Highlights

మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ వద్ద చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపే మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. 

అమరావతి: వైయస్ జగన్ ప్రభుత్వం మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలంటూ నిరసనకు దిగారు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాస్వామ్యానికి మీడియా ఫోర్త్‌ ఎస్టేట్‌ అని అలాంటి మీడియాకు సంకెళ్లు వేయడం సబబు కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ కళ్లకు, నోటికి నల్లరిబ్బన్లు కట్టుకుని అసెంబ్లీ వద్ద చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ నేతలు నిరసనకు దిగారు. వ్యవస్థల్లోని లోపాలను ఎత్తిచూపే మీడియాకు ప్రభుత్వం సంకెళ్లు వేయడం దురదృష్టకరమని అభిప్రాయపడ్డారు. మీడియాపై ఆంక్షలు ఎత్తివేయాలని టీడీపీ నేతలు డిమాండ్ చేశారు.  

2430 జీవో తీసుకొచ్చి కేసుల పేరుతో బెదిరిస్తున్నారని చంద్రబాబు నాయుడు మండపడ్డారు. జర్నలిస్టులపై దాడులకు పాల్పడుతున్నారంటూ విమర్శించారు. అసెంబ్లీలోకి రాకుండా ఏబీఎన్‌, ఈటీవీ, టీవీ5పై నిషేధం విధించడం సరికాదంటూ చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ట్రాయ్‌ ఆదేశాలున్నా ఎంఎస్‌వోలపై ఒత్తిడి తెచ్చి ప్రసారాలు నిలిపివేశారంటూ ఆరోపించారు. ఫైబర్‌‌గ్రిడ్‌కు ఫైన్‌ వేసినా సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

2430 జీవో విషయంలో ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని హితవు పలికారు. జర్నలిస్ట్‌ను వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి బెదిరిస్తే ఎలాంటి చర్యలు తీసుకోలేదని నడిరోడ్డుపై నరికేస్తానంటూ బెదిరించినా చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎందుకు కేసు నమోదు చేయలేదో చెప్పాలని నిలదీశారు. 

తూర్పుగోదావరి జిల్లాలో జర్నలిస్ట్‌ హత్యపై స్థానిక ఎమ్మెల్యేపై కేసు నమోదైందన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోవాలని సూచించారు. ప్రజాస్వామ్యాన్ని హరించినవాళ్లు కాలగర్భంలో కలిసిపోయారన్న విషయం వైసీపీ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. 

ఇవాళ సాయంత్రం గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. అవసరమైతే హైకోర్టును సైతం ఆశ్రయిస్తామని చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రజాస్వామానికి నాలుగో మూల స్థభం అయిన మీడియాపై ఇలానే వ్యవహరిస్తారా అంటూ తిట్టిపోశారు. 

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే మీడియాపై కేసులు పెడతాం అని చట్టం తీసుకురావడం దుర్మార్గమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ప్రజాస్వామ్య వ్యవస్థను ఎవ్వరూ నాశనం చేయలేరన్న చంద్రబాబు 2430జీవోని ప్రభుత్వం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 

ధరలు పెరగడం సహజమే... అసెంబ్లీలో మంత్రి కొడాలి నాని...

click me!