విజయవాడలో కరోనా కలకలం... ఎస్సైకి కరోనా పాజిటివ్

By Arun Kumar PFirst Published Apr 24, 2020, 8:34 PM IST
Highlights

కృష్ణా  జిల్లా విజయవాడ నగరంలో మరో కరోనా కేసు బయటపడింది. దీంతో నటరంలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. 

విజయవాడలో మరోసారి కరోనా కలకలం సృష్టించింది. నగరంలో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఎస్సైకి కరోనా వైరస్ సోకింది. దీంతో పోలీస్ శాఖలోనే కాదు విజయవాడలోనూ ఆందోళనకర వాతావరణం ఏర్పడింది. కరోనా పాజిటివ్ గా తేలిన ఎస్సైని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించి అతడితో ప్రైమరీ కాంటాక్ట్  కలిగిన వారిని గుర్తించే పనిలోపడ్డారు అధికారులు. 

కరోనా బారినపడ్డ ఎస్సై ఇటీవలే హైద్రాబాద్ నుండి విజయవాడకు వచ్చినట్లు సమాచారం. ఇతడితో పాటు మరో ఎస్సై, ముగ్గురు కానిస్టేబుల్స్ కలిసి ఒకే రూంలో అద్దెకు ఉంటున్నట్లు తెలుస్తోంది. దీంతో వారిని కూడా క్వారన్ టైన్ కు తరలించారు అధికారులు. వీరితో కలిసి పని చేసిన వారికి పరీక్షలు నిర్వహించేందుకు పోలీస్  ఉన్నతాధికారులు, వైద్యాదికారులు సన్నాహాలు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. మొత్తం కేసులు వేయికి చేరువలో ఉన్నాయి. తాజాగా గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 62 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు. మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఏపీలో 955కు చేరుకుంది. మరణాల సంఖ్య 29కి చేరుకుంది. తాజాగా గత 24 గంటల్లో అనంతపురం జిల్లాలో ఒకరు, కర్నూలు జిల్లాలో ఒకరు మరణించారు.

ఇప్పటి వరకు ఆస్పత్రుల్లో చికిత్స పొంది 145 మంది డిశ్చార్జీ అయ్యారు. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 781 ఉంది. గత 24 గంటల్లో కొత్తగా అనంతపురం జిల్లాలో నాలుగు, తూర్పు గోదావరి జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 14 కేసులు నమోదయ్యాయి. ఈ రోజు కూడా కర్నూలులో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో కర్నూలు జిల్లాలో 27 కేసులు నమోదయ్యాయి. నెల్లూరు ఒక కేసు, ప్రకాశం జిల్లాలో మూడు కేసులు నమోదయ్యాయి. 

విశాఖపట్నం, పశ్చిమ గోదావరి, చిత్తూరు జిల్లాల్లో తాజాగా కొత్త కేసులేమీ నమోదు కాలేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను కరోనా వైరస్ తాకలేదు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల విషయంలో కర్నూలు జిల్లా అగ్రస్థానంలో కొనసాగుతోంది. జిల్లా మొత్తం 261 కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లా ఎప్పటిలాగే రెండో స్థానంలో కొనసాగుతోంది. ఈ జిల్లాలో మొత్తం 206 కేసులు నమోదయ్యాయి. కాగా, కృష్ణా జిల్లాలో తాజాగా 14 కేసులు నమోదయ్యాయి. దీంతో కృష్ణా జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 102కు చేరుకుంది.

జిల్లాలవారీగా వివరాలు

అనంతపురం 46
చిత్తూరు 73
తూర్పు గోదావరి 34
గుంటూరు 206
కడప 51
కృష్ణా 102
కర్నూలు 261
నెల్లూరు 68
ప్రకాశం 53
విశాఖపట్నం 22
పశ్చిమ గోదావరి 39

click me!