
సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో చుక్కెదురైంది. తన శిక్షను పునఃపరిశీలించాలని కోరుతూ శ్రీలక్ష్మి దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను హైకోర్టు కొట్టేసింది. ఇక, ఏపీ హైకోర్టు హాస్టళ్లలో సామాజిక సేవ చేయాలని కొద్ది రోజుల క్రితం శ్రీలక్ష్మిని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే తనకు విధించిన శిక్షను పునఃసమీక్షించాలని శ్రీలక్ష్మి అనుబంధ పిటిషన్ను దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్ విచారణ అర్హతపై సందేహం వ్యక్తం చేస్తూ రిజిస్ట్రీ నెంబర్ కేటాయించేందుకు నిరాకరించారు.
దీంతో కోర్టు ధిక్కార కేసులో పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని శ్రీలక్ష్మి తరఫున ఏఏజీ సుధాకర్రెడ్డి వాదనలు వినిపించారు. ఈ పిటిషన్కు విచారణార్హత ఉందని.. గతంలో ఏపీ, కేరళ హైకోర్టులు తీర్పులు ఇచ్చాయని ప్రస్తావించారు. ఈ క్రమంలోనే శ్రీలక్ష్మి పిటిషన్ను స్పీకరించిన హైకోర్టు.. నేడు విచారణ చేపట్టి కొట్టివేసింది.
విద్యాలయ ప్రాంగణాల్లో గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాల వంటి వాటిని నిర్మిస్తుండటాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. విద్యాలయ ప్రాంగణాల్లో ఆర్బీకేలు, గ్రామ సచివాలయాల నిర్మాణాలు చేయవద్దని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని ఈ తీర్పును అమలు చేయకపోవడంతో న్యాయస్థానం.. కోర్టు ధిక్కార చర్యలు చేపట్టింది. 8 మంది ఐఏఎస్ అధికారులకు రెండు వారాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ ఐఏఎస్ అధికారులు జైలుశిక్షను రద్దు చేయాలని క్షమాపణ చెప్పారు.
ఈ క్రమంలోనే వారికి జైలు శిక్షకు బదులుగా సేవా కార్యక్రమాలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టళ్లలో నెలకు ఒక రోజు సేవ చేయాలంటూ తీర్పునిచ్చింది. సొంత డబ్బుతో విద్యార్థులకు ఒకపూట భోజనం పెట్టాలని ఆదేశించింది. ఆ 8 మంది ఐఏఎస్ అధికారుల్లో శ్రీలక్ష్మి కూడా ఉన్నారు.