అనంతపురం: పోలీసుల లాఠీచార్జీలో గాయపడ్డ విద్యార్థిణి అదృశ్యం... తల్లిదండ్రుల ఆందోళన

By Arun Kumar PFirst Published Nov 9, 2021, 11:14 AM IST
Highlights

అనంతపురంలో ఎస్ఎస్బిఎన్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో గాయపడ్డ జయలక్ష్మి అనే విద్యార్థిణి అదృశ్యమయ్యింది. 

అనంతపురం: జగన్ సర్కారు ఎయిడెడ్ కాలేజీలను విలీన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు దిగిన ఎస్‍ఎస్‍బీఎన్ కాలేజీ విద్యార్థులపై సోమవారం పోలీసులు లాఠీచార్జి చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ లాఠీచార్జీలో గాయపడిన విద్యార్థిణి జయలక్ష్మి ప్రస్తుతం కనిపించడం లేదు. నిన్న రాత్రినుండి ఆమె కనిపించడం లేదు. జయలక్ష్మి అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. 

అనంతపురం SSBN College విద్యార్థులపై నిన్న జరిగిన దాడిని ఇవాళ(మంగళవారం) నిరసిస్తూ విద్యార్థి సంఘాలు, విద్యా సంస్థలు బంద్ చేపట్టాయి. ఈ నేపథ్యంలో పలువరు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తుగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే లాఠీచార్జీలో గాయపడ్డ జయలక్ష్మి ఇంటిచుట్టు కూడా మఫ్టీలో స్పెషల్ పార్టీ పోలీసులను మొహరించారు. 

అయితే సోమవారం రాత్రినుండి జయలక్ష్మి కనిపించడం లేదని తల్లిదండ్రులు తెలపడంతో పోలీసులేమైనా ఆమెను అదుపులోకి తీసుకున్నారా అన్న అనుమానం వ్యక్తమైంది. పోలీసులు మాత్రం జయలక్ష్మి గురించి తమకేమీ తెలియదంటున్నారు. పోలీసులకు భయపడి ఆమె ఇంటికి రాకుండా ఎక్కడికైనా వెళ్లిందా లేక పోలీసులే నిర్బంధించారా అన్నది తెలియాల్సి వుంది. 

వీడియో

సోమవారం ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కదంతొక్కిన అనంతపురం ఎస్ఎస్బిఎన్  విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. కాలేజీని బంద్ చేసి విద్యార్థులతో ఆందోళన చేపట్టిన విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసులు లాఠీచార్జీ చేసారు. ఈ ఘటనలో కొందరు విద్యార్థులు గాయపడ్డారు. గాయపడిన వారిలో ఒకరైన జయలక్ష్మి తాజాగా కనిపించకుండా పోవడంతో ఆందోళన చెందుతున్నారు. 

read more  బాలికను కిడ్నాప్ చేసి, లైంగిక దాడి.. యువకుడికి 20 యేళ్ల జైలు శిక్ష..

ఇక ఎస్‍ఎస్‍బీఎన్ ఎయిడెడ్ కళాశాల దగ్గర విద్యార్థులను పోలీసులు విచక్షణారహితంగా కొడుతూ లాఠీఛార్జ్ చెయ్యడాన్ని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీఛార్జ్ చేయించడం, తలలు పగిలేలా కొట్టించడం జగన్ రెడ్డి అహంకార ధోరణికి నిదర్శనమని లోకేష్ మండిపడ్డారు.

''గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఎయిడెడ్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలంటూ నిరసన తెలపడం కూడా రాజారెడ్డి రాజ్యాంగంలో నేరమేనా? విద్యార్థి ఉద్యమాలు అణిచి వెయ్యాలని చూసిన ఎంతటి నియంత అయినా నేలకొరగడం ఖాయం. ఎయిడెడ్ విద్యా వ్యవస్థను ధ్వంసం చేసే నిర్ణయాలు వెంటనే వైసీపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఇచ్చిన జిఓలు రద్దు చెయ్యాలి'' అని nara lokesh డిమాండ్ చేసారు. 

ఈ ఘటనపై టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మానం ప్రణవ్ గోపాల్ కూడా సీరియస్ అయ్యారు. anantapur లో ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జగన్ రెడ్డి లాఠీచార్జ్ చేయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని... పోలీసులను విద్యార్ధినులపై విచక్షణా రహితంగా దాడి చేయడం హేయమని అన్నారు.  విద్యార్దులపై పడిన ఒక్కో లాఠీ దెబ్బ జగన్ రెడ్డి ప్రభుత్వానికి దగ్గర పడుతున్న గడియలుగా లెక్కవేసుకోవాలని హెచ్చరించారు. విద్యార్ధినులపై దాడులు చేయించిన జగన్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేయాలని ప్రణవ్ గోపాల్ డిమాండ్ చేసారు. 

read more  ఆ ఆస్తులపై జగన్ రెడ్డి కన్ను... భారీ కుట్రకు ప్లాన్: టిఎన్ఎస్ఎఫ్ అధ్యక్షుడు ప్రణవ్ సంచలనం

అయితే పోలీసుల వాదన మరోలా వుంది. కళాశాల వద్ద పోలీసులు విద్యార్థులపై లాఠీ చార్జి చేయలేదని అనంతపురం జిల్లా పోలీసు కార్యాలయం ప్రకటించింది. విద్యార్థులను కళాశాలలోకి వెళ్లకుండా అడ్డుకుంటున్న విద్యార్థిసంఘాల నాయకులను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించారని... దీంతో కొందరు విద్యార్థులు పోలీసులపై రాళ్లు రువ్వినట్లు పేర్కొన్నారు. దీంతో గాయపడిన ఓ విద్యార్థినిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించామని... స్వల్ప గాయాలైన సదరు విద్యార్థికి ప్రమాదమేమి లేదని డాక్టర్ల వెల్లడించారన్నారు. జిల్లా సర్వజన ఆసుపత్రి ముందు రహదారిపై వాహనాల రాకపోకలకు అంతరాయం కల్గించడానికి యత్నించిన విద్యార్థులను మాత్రమే చెదరగొట్టినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. 
 

click me!