
టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర శనివారం 150వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా అల్లూరుకు చేరుకున్న లోకేష్ కు ఘటన స్వాగతం లభించింది. ఆయనను చూసేందుకు రోడ్లపైకి భారీగా జనం చేరుకున్నారు. లోకేష్ ముందుగా పోలేరమ్మ అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా లోకేష్ మహిళలు, యువత, వృద్ధులను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటాయని, రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెరిగాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సామాన్యులు బతికే పరిస్థితి లేదని తెలిపారు.
తరువాత రోడ్డుకి ఇరువైపులా షాపులు నిర్వహిస్తున్న వ్యాపారస్తులను లోకేష్ కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం చెత్త పన్ను, బోర్డు పన్ను, ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటూ వ్యాపారస్తులను వేధిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్రోల్, డీజిల్ పై పన్ను తగ్గిస్తామని ఆయన హామీ ఇచ్చారు. దీని ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని అన్నారు. అలాగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అడ్డగోలుగా పెంచేసిన అన్ని రకాల పన్నులు తగ్గిస్తామని చెప్పారు. కరెంట్ ఛార్జీలపై పెంచిన భారాన్ని కూడా టీడీపీ తగ్గిస్తుందని అన్నారు.