
వైఎస్సార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో విధుల్లో ఉన్న ఆర్టీవో శివప్రసాద్తో పాటు మరొకరు మృతిచెందారు. వివరాలు.. ఆర్టీవో శివప్రసాద్ అలంఖాన్ పల్లె వద్ద విధులు నిర్వహిస్తున్నారు. అయితే తెల్లవారుజామున విధుల్లో ఉన్న సమయంలో శివప్రసాద్తో పాటు కేశవ్ అనే మరో వ్యక్తిని టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కేశవ్ అక్కడికక్కడే మృతిచెందగా.. శివప్రసాద్ తీవ్రంగా గాయపడ్డారు. అయతే శివప్రసాద్ను ఆస్పత్రికి తరలించినప్పటికీ.. పరిస్థితి విషమించడంతో మృతిచెందారు. ఇక, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదిలా ఉంటే, తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద ఓ ఆటోను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకన్న పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తుచేస్తున్నారు.