కొంపముంచిన స్మార్ట్ ఫోన్
విశాఖ: విశాఖ జిల్లా కోటపురట్ల మండలం బాపిరాజు కొత్తపల్లిలో 13 ఏళ్ళ బాలికపై 15 ఏళ్ళ బాలుడు అత్యాచారయత్నానికి ప్రయత్నించాడు.స్మార్ట్ఫోన్లో నీలి చిత్రాలను చూసి బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించాడని పోలీసులు గుర్తించారు.ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు వివరించారు.
13 ఏళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి ప్రయత్నించిన బాలుడికి 15 ఏళ్ళ వయస్సు. ఇటీవలనే అతను పదోతరగతి ఉత్తీర్ణుడయ్యాడు. దీంతో అతనికి తల్లిదండ్రులు స్మార్ట్ఫోన్ ను బహుమతిగా ఇచ్చారు.స్మార్ట్ఫోన్లో నీలిచిత్రాలు చూడడం అలవాటు చేసుకొన్నాడు.
ఈనెల పదో తేదీ సాయంత్రం కోటవురట్ల మండలం బీకేపల్లి సమీపంలోని పొలం పాక వద్ద ఐదుగురు పిల్లలు చేరారు. అందులో ఈ బాలుడితో పాటు ఏడో తరగతి ఉత్తీర్ణురాలైన పదమూడేళ్ల బాలిక కూడా ఉంది. బాలిక నిందితుడికి వరసకు సోదరి అవుతుంది. సాయంత్రం వర్షం పడే సూచనలు ఉండడంతో మిగతా ముగ్గురు పిల్లలు ఇళ్లకు వెళ్లిపోయారు. పొలం పాకలో తమ సిమెంట్ బస్తాలు ఉండడంతో వాటిపై పరదా కప్పేందుకు ఈ బాలిక పాకలోకి వెళ్లింది.
బాలుడు ఆమె వెనకే వెళ్లి పట్టుకోబోయాడు. ఆమె గట్టిగా కేకలు వేసింది. బెంబేలెత్తిన బాలుడు ఆమె మెడకు చున్నీ బిగించి తాటాకు పాక రాటకు అదిమిపెట్టాడు. ఊపిరి ఆడక స్పృహ కోల్పోయింది. నేరుగా బాలిక ఇంటికి వెళ్లిన అతడు, బాలికపై సిమెంట్ బస్తా పడిపోయిందని చెప్పాడు. వారొచ్చి వెంటనే నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో చూపించి, అనంతరం విశాఖలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు.
ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత బాలిక ఇంటికి చేరింది. అయితే బాలిక తల్లిదండ్రులు బాలుడిపై అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయమై బాలుడిని ప్రశ్నిస్తే అసలు విషయాన్ని వెల్లడించినట్టుగా పోలీసులు తెలిపారు.