విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య తొలిసారి తమ కొడుకు యాత్ర గ్రాడ్యుయేషన్ వేడుకలో కలిసి కనిపించారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

విడాకుల తర్వాత ధనుష్, ఐశ్వర్య ఇలా.. 

ప్రముఖ నటుడు ధనుష్,  దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల తర్వాత తొలిసారి కలిసిన సందర్భం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ దంపతులు తమ పెద్ద కుమారుడు యాత్ర స్కూల్ గ్రాడ్యుయేషన్ వేడుకలో కలిసి కనిపించారు. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ధనుష్ కొడుకు స్కూల్ గ్రాడ్యుయేషన్ 

యాత్ర తన చదువును చెన్నైలోని అమెరికన్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో పూర్తి చేశాడు. ఈ గ్రాడ్యుయేషన్ ఈవెంట్‌కు తండ్రి ధనుష్, తల్లి ఐశ్వర్య ఇద్దరూ హాజరయ్యారు. ఈ ఫోటోలను ధనుష్ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేయడం విశేషం. ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ కొడుకుని ప్రేమగా కౌగిలించుకుంటున్న దృశ్యాలు అభిమానులని ఆకట్టుకుంటున్నాయి. 

ముగిసిన 18 ఏళ్ళ వైవాహిక జీవితం 

2004 నవంబర్ 18న ధనుష్, ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు యాత్ర, లింగా ఉన్నారు. 2022 జనవరి 17న ఈ జంట విడాకుల ప్రకటన చేశారు. దాదాపు 18 ఏళ్ల వైవాహిక జీవితం తర్వాత, 2024 నవంబర్ 27న వీరికి లీగల్‌గా విడాకులు మంజూరయ్యాయి.

విడాకుల తర్వాత ధనుష్ తన సినీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఐశ్వర్య యోగా, ఫిట్‌నెస్ వ్యక్తిగత జీవన శైలిపై దృష్టిపెడుతున్నారు. అయితే, తమ కొడుకుకు మద్దతుగా ఇద్దరూ కలిసి కనిపించడం అభిమానులను ఆశ్చర్యపరిచింది.

మనవడిపై సూపర్ స్టార్ రజనీ కామెంట్ 

ఈ సందర్భంలో రజనీకాంత్ కూడా తన మనవడికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. “నా మనవడు సాధించిన ఫస్ట్ మైల్ స్టోన్.. కంగ్రాట్స్ యాత్ర కన్నా'' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. 

ఈ ఫోటోలు ఒకప్పటి కుటుంబ బంధాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నాయి. విడిపోయినా, తల్లిదండ్రులుగా తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న ధనుష్, ఐశ్వర్య పై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 

త్వరలో కుబేరగా రాబోతున్న ధనుష్ 

ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. ధనుష్ సార్ మూవీ తర్వాత తెలుగు దర్శకుడితో చేస్తున్న మరో మూవీ ఇది. ఈ మూవీలో నాగార్జున, రష్మిక మందన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన టీజర్ కి క్రేజీ రెస్పాన్స్ వచ్చింది. 

మరోసారి ధనుష్ ఇంటెన్స్ అండ్ ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ తో కట్టిపడేయబోతున్నట్లు అర్థం అవుతోంది. ధనుష్ తన మాజీ భార్య ఐశ్వర్య దర్శకత్వంలో కూడా నటించారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన చిత్రం 3. 

ఇటీవల ధనుష్ నటనపై మాత్రమే కాకుండా దర్శకత్వంపై కూడా ఫోకస్ చేస్తున్నారు. ధనుష్ దర్శకత్వంలో చివరగా రాయన్ అనే చిత్రం వచ్చింది. మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ధనుష్ స్వీయ దర్శకత్వంలో ఇడ్లీ కడై అనే చిత్రాన్ని రూపొందిస్తున్నారు.