CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి ఆదివారం హరేకృష్ణ హెరిటేజ్ టవర్ నిర్వహిస్తున్న అనంత శేష స్థాపనలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశారు. మ‌రీ ముఖ్యంగా అక్ర‌మ క‌ట్ట‌డాల గురించి చేసిన వ్యాఖ్య‌లు మ‌రోసారి భూములు క‌బ్జాలు చేస్తున్న‌ అక్ర‌మార్కుల గుండెళ్లో రైళ్లను పరుగెత్తించేలా చేసింది. రాష్ట్రంలో చెరువులు, కుంట‌లు స‌హా జ‌లాశ‌యాల‌ను క‌బ్జా చేసి అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన ఎవ్వ‌రినీ వ‌దిలిపెట్ట‌బోమ‌ని హెచ్చ‌రించారు. 

ప్ర‌స్తుతం తెలంగాణ‌లో హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) చెరువులు, కుంట‌లు స‌హా ఇత‌ర జ‌లాశ‌యాల‌ను కబ్జా చేసి కట్టిన భారీ బిల్డింగులు, అపార్ట్‌మెంట్లు, కన్వెన్షన్ హ‌ళ్ల‌ను కూల్చివేత చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఈ క్ర‌మంలోనే మాదాపూర్‌ తమ్మిడికుంట చెరువు ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్‌లో సినీ న‌టుడు నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించినట్లు ప్ర‌భుత్వం గుర్తించింది. అక్క‌డి నిర్మాణాల‌పై చ‌ర్య‌లు తీసుకుంటూ కూల్చివేసింది. 

దీనిపై భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ క్ర‌మంలోనే ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హరేకృష్ణ హెరిటేజ్ టవర్ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ.. అక్ర‌మ నిర్మాణాలు చేప‌ట్టిన వారికి మ‌రోసారి హెచ్చ‌రిక‌లు పంపారు. జ‌లాశ‌య భూములు ఆక్ర‌మ‌ణ చేసి అక్రమ నిర్మాణాలను చేప‌ట్టిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఎంత‌టివారైనా ఎట్టి పరిస్థితుల్లో వ‌దిలిపెట్టబోమని స్ప‌ష్టం చేశారు. అక్రమణదారుల నుంచి జ‌లాశ‌యాల‌కు విముక్తి క‌ల్పిస్తామ‌ని చెప్పారు. భగవద్గీత స్ఫూర్తిగా ఈ విష‌యంలో ప‌నిచేస్తున్నాన‌నీ, శ్రీకృష్ణుడి గీతాబోధన అనుసారమే అక్రమ నిర్మాణాల కూల్చివేతను మొద‌లుపెట్టామ‌ని చెప్పారు. 

చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ చేసి ఆ ప్రాంత నిర్మాణాల్లో తన మిత్రుల ఫామ్‌హౌస్లు ఉన్నా వ‌దిలిపెట్టే ప్ర‌సక్తే లేద‌ని అన్నారు. శ్రీమంతులు చెరువులు, కుంట‌లు ఆక్ర‌మ‌ణ చేసి ఫాంహౌస్లు కట్టుకోవ‌డంతో పాటు డ్రైనేజీ నీటిని చెరువుల్లో కలుపుతున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. అక్ర‌మ క‌ట్ట‌డాల కూల్చివేత కక్ష సాధింపు చర్యలు కావ‌ని స్ప‌ష్టం చేసిన రేవంత్ రెడ్డి.. అక్రమ నిర్మాణాలు అలాగే వదిలేస్తే తాను ప్రజా ప్రతినిధిగా విఫలం అయినట్లే అన్నారు. ప్ర‌జ‌లు శ్రీమంతుల అక్ర‌మ నిర్మాణాల నుంచి వ‌చ్చే మురికి నీరును తాగాలా? అని మండిప‌డ్డారు.