కరోనా కొత్త వేరియంట్ పై ‘ఇన్సాకాగ్’ ప్రత్యేక దృష్టి.. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచనలు..
భారత్ లోమళ్లీ కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రోజురోజుకూ తన రూపు మార్చుకుంటున్న కోవిడ్-19 అత్యంత ప్రమాదకరంగా మారుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలోనే వెలుగులోకి వచ్చిన ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు రెట్టింపు వ్యాప్తి, ప్రభావం కలిగించేవిగా ఉన్నాయని పరిశోధకులు, వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కరోనా కొత్త వేరియేంట్లుగా బీఏ2తో పాటు బీఏ4, బీఏ5 దేశంలో వ్యాప్తిలో ఉందని వైద్య పరిశోధకులు తెలియజేశారు. అయితే గతకొద్ది రోజులుగా పెరుగుతున్న కరోనా కేసులపై ఇండియన్ సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్టియం (INSACOG) ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈమేరకు వైరస్ వ్యాప్తికి గల మరిన్ని విషయాలను తెలుసుకునే దిశగా పరిశోధనలు జరుపుతున్నాయి.
ఈ సందర్భంగా దేశంలోని కరోనా కేసులపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇటీవల కేసులు పెరుగుతుండటంతో మరేదైనా కొత్త వేరియంట్ వచ్చిందా? అని తేల్చే పనిలో ఉన్నారు. ఇందుకు దేశంలో ఏ ప్రాంతాల్లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయో గుర్తిస్తున్నారు. అక్కడి నుంచి షాంపిల్స్ తెప్పించుకొని పరిశోధనలు చేస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కూడా ఏజెన్సీ పలు సూచనలు చేసింది. గతం వారం రోజులుగా మీ జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదైతే వెంటనే ఆ శాంపిల్స్ ను ల్యాబ్ కు పంపించాలని సూచించింది. అలాగే బ్రేక్ త్రూ ఇన్ ఫెక్షన్ కేసుల ద్వారా కొత్త వేరియంట్ ఏమైనా వచ్చిందా? లేక సబ్ వేరియంట్ ఏదైనా పుట్టుకొచ్చిందా తెలుసుకునే అవకాశం ఉందన్నారు.
మరోవైపు కోవిడ్-19 కేసులు, మరణాలు క్రమంగా పెరుగుతుండటం భారత్ లో కలకలం రేపుతోంది. దేశంలో కొత్తగా కరోనా మహమ్మారి కేసులు 13 వేలు దాటాయి. మరణాలు సైతం పెరిగాయి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలో కోవిడ్-19 కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. 24 గంటల్లో దేశంలో కొత్తగా 13,216 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కొత్త కేసులు అధికంగా ఢిల్లీ, ముంబై), బెంగళూరు, చెన్నైలలో నమోదయ్యాయి. ప్రస్తుతం దేశంలో 68,108 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా ప్రభుత్వం కూడా వైరస్ ను అరికట్టేందుకు కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం ముమ్మరంగా కొనసాగుతోంది. మొత్తంగా 196 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్టు సమాచారం.