Work From Traffic: సిటీ మనుషులు ఉరుగులు పరుగుల జీవితానికి అలవాటు పడ్డారు. పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు హడావిడిగా గడిపేస్తున్నారు. భార్య, భర్త అనే తేడా లేకుండా ఇద్దరూ తెగ కష్టపడుతున్నారు. పెరుగుతున్న ధరలతో పాటు పిల్లలకు మంచి చదువును అందించడానికి ఇద్దరూ కష్టపడాల్సి వస్తుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేసుకొని ఏ సాయంత్రానికో ఇంటికి చేరుకుంటున్నారు.

ముఖ్యంగా ఐటీ కంపెనీలు విస్తరించి ఉన్న హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఇలాంటి చిత్రాలు అధికంగా కనిపిస్తుంటాయి. బెంగళూరును సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా అంటారు. ఇక్కడ ఐటీ కంపెనీలు, ఉద్యోగులు అధికంగా ఉండటమే ఈ పేరు రావడానికి కారణం. సిటీ బాగా డెవలప్ అయినప్పటికీ.. ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు అధికంగా ఉండటం సర్వసాధారణం అయిపోయింది.

దీంతో ఐటీ ఉద్యోగులు చాలా సార్లు ట్రాఫిక్ లో ఇరుక్కుపోతుంటారు. చాలా సార్లు ఇలా ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఐటీ ఉద్యోగులు.. అక్కడే లాప్ టాప్ ఆన్ చేసి వర్క్ చేస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. 

ఓ మహిళ తన ఇంటి నుంచి ఆఫీస్ కు స్కూటీ పై బయలుదేరింది. మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో ఆమె తన స్కూటర్ పై కూర్చొని ఫోన్ స్టాండ్ కు అమర్చిన మొబైల్ ద్వారా జూమ్ కాల్ మీటింగ్ హాజరైంది. ఓ వైపు ట్రాఫిక్ జామ్ కాగా.. మరో వైపు ఆమె తన ఉద్యోగాన్ని రోడ్డుపై నుంచే చేయడం ప్రారంభించింది. దీనిని అదే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన ఓ సోషల్ మీడియా యూజర్ వీడియో తీశాడు. 

అనంతరం దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశాడు. దానికి ‘వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్.. బెంగళూర్ లో మామూలు రోజు..’ అని క్యాప్షన్ జత చేశాడు. నెటిజన్లు కూడా ఆ పోస్ట్ కు ‘వర్క్ ఫ్రమ్ ట్రాఫిక్’ అని కామెంట్లు పెడుతున్నారు. వీడియో సిలికాన్ వ్యాలీలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పై సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది. స్కూటీపై జూమ్ కాల్ కు హాజరైన వీడియో ‘ఎక్స్’ లో పోస్ట్ కాగానే వైరల్ గా మారింది.