న్యూడిల్లీ :  కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించనున్నారు.  ఈమేరకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండి కూటమి ఏకాభిప్రాయానికి వచ్చింది. ఇవాళ(మంగళవారం) కాంగ్రెస్ జాతీయాధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే నివాసంలో ఇండి కూటమి పార్టీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ రాహుల్ గాంధీని లోక్ సభలో ప్రతిపక్ష నేతగా ఎన్నుకుందామన్న ప్రతిపాదన చేయగా మిగతా పార్టీలన్ని అంగీరించాయి. ఇందుకు సంబంధించిన సమాచారం లోక్ సభ ప్రోటెం స్పీకర్ బతృహరి మెహతాబ్ కు అందించినట్లు కాంగ్రెస్ నేత కేసి వేణుగోపాల్ వెల్లడించారు. 

కాంగ్రెస్ అధినాయకురాలు సోనియా గాంధీ స్వయంగా రాహుల్ గాంధీని ప్రతిపక్ష నేతగా ఎన్నుకున్నట్లు ప్రోటెం స్పీకర్ కు లేఖ రాసినట్లు కేసి వేణుగోపాల్ తెలిపారు. కూటమి పార్టీలన్ని రాహుల్ ను ప్రతిపక్ష నేతగా అంగీకరించినట్లు ప్రోటెం స్పీకర్ కు తెలిపారు. దీంతో ఇకపై లోక్ సభలో ప్రతిపక్ష కూటమికి రాహుల్ గాంధీ సారథ్యం వహించనున్నారు.  

 

ఈ లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ రెండు స్థానాల్లో పోటీచేసి గెలిచారు. దీంతో గత ఐదేళ్లు ఎంపీగా పనిచేసిన వయనాడ్ సీట్ ను వదులుకుని తన కుటుంబ సీటు రాయ్ బరేలి ఎంపీగా కొనసాగనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే వయనాడ్ ఎంపీగా రాజీనామా చేయగా ప్రోటెం స్పీకర్ దాన్ని అంగీకరించారు. దీంతో వయనాడ్ లో ఉపఎన్నిక అనివార్యం అయ్యింది... ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా తన సోదరి ప్రియాంకా గాంధీ పోటీ చేయనున్నట్లు స్వయంగా రాహుల్ ప్రకటించారు. 

ఇదాలావుంటే రాహుల్ గాంధీ ఐదోసారి ఎంపీగా గెలిచారు. దీంతో ఆయన ఇవాళ లోక్ సభలో ఆయన ప్రమాణస్వీకారం చేసారు. భారత రాజ్యాంగాన్ని చేతబట్టుకుని దానిపైనే ప్రమాణం చేసారు రాహుల్ గాంధీ. ఆయన ప్రమాణస్వీకార  సమయంలో ఇండి కూటమి సభ్యులు కరతాళధ్వనులు చేసారు.