
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావించిన దిగ్గజ సినీనటుడు మిథున్ చక్రవర్తికి భారతీయ జనతా పార్టీ హ్యాండిచ్చింది. బెంగాల్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ తన చివరి జాబితాను మంగళవారం విడుదల చేసింది.
13 మంది అభ్యర్ధులతో విడుదల చేసిన ఈ లిస్ట్లో మిథున్ చక్రవర్తి పేరు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే విడుదల చేసిన జాబితాల్లో తన పేరు లేకపోవడంతో త్వరలో విడుదల చేసే వాటిలో అవకాశం లభిస్తుందని చక్రవర్తి ఆశలు పెట్టుకున్నారు.
ప్రధాని రాష్బెహారి టికెట్ మిథున్కే ఇస్తారని, ఆయన అక్కడి నుంచే పోటీ చేయబోతున్నారని ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల్లో కాశ్మీర్ ఇంచార్జీగా పని చేసిన రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సుబ్రతా సాహాని బీజేపీ బరిలోకి దింపింది. దీంతో మిథున్ కేవలం ప్రచారానికి మాత్రమే పరిమతమయ్యారు.
కాగా, మార్చి 7న కోల్కతాలోని బ్రిగేడ్ పెరేడ్ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో మిథున్ చక్రవర్తి బీజేపీలో చేరారు. ఆయన ఆయన బెంగాలీ సినిమాల్లోని పవర్ ఫుల్ డైలాగ్స్తో టీఎంసీపై విరుచుకుపడ్దారు.
గతంలో తృణమూల్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మిథున్ చక్రవర్తికి స్టార్డమ్తో పాటు రాజకీయ అనుభవంతో బీజేపీలో మంచి ప్రాధాన్యతే ఉంటుందని ప్రచారం జరిగింది.
అదే సమయంలో ఆయన తన ఓటు హక్కును ముంబై నుంచి బెంగాల్కు మార్చుకున్నారు. అయితే బీజేపీ విడుదల చేసిన తుది జాబితాలోనూ మిథున్ పేరు లేకపోవడంపై మాత్రం బెంగాల్ రాజకీయాలతో పాటు చిత్ర పరిశ్రమలోనూ చర్చ కు కారణమైంది.
మిథున్కు టికెట్ రాకపోవడంపై ఆయన అభిమానులు తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 29 మధ్య ఎనిమిది దశల్లో జరగనున్నాయి. మే 2న ఫలితాలు విడుదల కానున్నాయి.