గాజువాకలో దారుణం...నడిరోడ్డుపైనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి

By Arun Kumar PFirst Published Sep 21, 2020, 1:30 PM IST
Highlights

నడిరోడ్డుపై ఓ గుర్తుతెలియని వ్యక్తి  మంటల్లో కాలిపోతూ మృతిచెందిన విషాద సంఘటన విశాఖపట్నంలోని గాజువాకలో చోటుచేసుకుంది. 

నడిరోడ్డుపై ఓ గుర్తుతెలియని వ్యక్తి  మంటల్లో కాలిపోతూ మృతిచెందిన విషాద సంఘటన విశాఖపట్నంలోని గాజువాకలో చోటుచేసుకుంది. ఉదయం దీన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఈ వ్యక్తి ఎవరు? ఆత్మహత్య చేసుకున్నాడా లేక ఎవరైనా హత్యచేశారా? అనే విషయాలపై పోలీసుల దర్యాప్తు సాగుతోంది. 

మరోవైపు ఓ మైనర్ బాలుడు దారుణ హత్యకు గురయిన సంఘటన గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామంలో చోటుచేసుకుంది.  నుదురుపాడుకు చెందిన లక్ష్మి 10 ఏళ్ల క్రితం దావల నాగేశ్వరబాబును కులాంతర వివాహం చేసుకుంది. వీరికి యశ్వంత్‌కుమార్, ఆరేళ్ల జ్యోతి ఉన్నారు. ఏడాదిన్నర క్రితం లక్ష్మి భర్త అనారోగ్యంతో మృతి చెందడంతో మేనమామ పల్లపు వీరాస్వామి గొరిజవోలుకు తీసుకొచ్చి నివాసం ఏర్పాటు చేశాడు.

 ఈ నెల 18న తన కుమారుడు యశ్వంత్‌కుమార్‌ పుట్టినరోజు కావటంతో ఆమె కేక్ తీసుకురావడానికి బయటకు వెళ్లింది. తిరిగి వచ్చే సమయానికి కొడుకు కనిపించలేదు. దీంతో.. వెంటనే ఆమె చుట్టుపక్కల గాలించింది. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా లక్ష్మి సమీప బంధువైన వీరస్వామి.. బాలుడిని  బైక్ పై ఎక్కించుకు తీసుకువెళ్లాడు. అలా తీసుకువెళ్లడాన్ని లక్ష్మి కుమార్తె జ్యోతి చూసింది. దీంతో ఆమె అదే విషయాన్ని తల్లికి తెలియజేసింది.

కాగా.. ఆమె అప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. వారు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. ఓ గోనెసంచిలో బాలుడి శవం కనిపించడంతో.. అందరూ షాక్ అయ్యారు. కాగా.. వీరాస్వామి బాలుడిని చంపినట్లు  అనుమానిస్తున్నారు. అతనిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

click me!