ఏపి రాజధాని ఎక్కడున్నా సరే... అవన్నీ వుండాల్సిందే: మాజీ మంత్రి బండారు

By Arun Kumar PFirst Published Jan 4, 2020, 8:12 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ రాజధానులుగా మూడు నగరాలను  ఎంచుకున్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయాన్ని టిడిపి వ్యతిరేకిస్తుండగా ఆ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి మాత్రం విచిత్రంగా స్పందించారు. 

విశాఖపట్నం: రాజధానిపై అసెంబ్లీలో జగన్ ప్రకటనకు, జిఎన్ రావు కమిటీ నివేదికకు, బోస్టన్ కన్సల్టెంట్ నివేదికకు ఏదైనా తేడా ఉందా అని మాజీమంత్రి బండారు సత్యనారాయణ ప్రశ్నించారు. దీన్నిబట్టే జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కన్సల్టింగ్ కమిటీ నివేదికలు కేవలం కాలయాపన కోసమే ఏర్పాటు చేసినట్లు స్పష్టంగా అర్థమవుతోందని... ఇవి స్వతంత్రంగా కాకుండా జగన్ చెప్పినట్లుగానే నివేదికలు తయారుచేసినట్లు పేర్కొన్నారు. 

ఇటీవల సీఎంకు నివేదిక సమర్పించి మూడు రాజధానుల నిర్ణయాన్ని సమర్థించిన బోస్టన్ కమిటీ సభ్యులు రాష్ట్రంలో ఎక్కడ తిరిగారని.. ఏ ప్రాంత ప్రజలు, నాయకుల అభిప్రాయాలు సేకరించిందో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని పరిశీలించకుండానే, ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా ఆ కమిటీ సీఎం అభిప్రాయాన్ని సేకరించిందని... అందుకు అనుగుణంగానే నివేదిక సమర్పించిందన్నారు. వాళ్లు ఇచ్చిన నివేదికకు ఏమయినా అర్థం ఉందా అని విరుచుకుపడ్డారు. 

ప్రభుత్వ శాఖల హెచ్‌ఓడి కార్యాలయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తే బస్సుకు వేసుకొని జనాలు తిరుగుతారా అని ప్రశ్నించారు. రాజధానిని ఎక్కడ ఏర్పాటు చేసినా అసెంబ్లీ, సచివాలయం, హెచ్‌ఓడి కార్యాలయాలు అన్నీ ఒక చోట ఉండాలన్నదే తమ డిమాండ్ అని మాజీ మంత్రి పేర్కొన్నారు. 

రాజధాని రిపోర్ట్ జగన్మోహన్ రెడ్డి రిపోర్ట్ లా ఉందని... ప్రజలు అడిగింది ఒక్కటయితే ప్రభుత్వం చేస్తుంది ఇంకోటని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికల హామీలైన నవరత్నాలను అమలు చేయలేక రాజధాని మార్పు పేరుతో పబ్బం గడుపుతుందని విమర్శించారు. 

read more  జగన్ సర్కార్ సంచలన నిర్ణయం... ఎసిబి చీఫ్ విశ్వజిత్ పై బదిలీ వేటు

ఇక వ్యవసాయానికి పెట్టుబడి కింద ఆర్థిక సాయం అందిస్తామని రైతు భరోసా పేరిట అన్నదాతలకు ఆశచూపి... ఇప్పుడు డబ్బులు వేయకుండా ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సమంజసమన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా రైతులకు రైతు భరోసా డబ్బులు ఇప్పటివరకు పడలేవన్నారు. 

తమది రైతు ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం జగన్ రైతులకు భరోసా డబ్బులు ఎప్పుడు ఇస్తారో స్ఫష్టం చేయాలన్నారు. రైతు భరోసా పేరుతో అన్నదాతలు సాయం చేయడం కాదు ఇబ్బందులకు గురుచేస్తున్నారని  ఆరోపించారు. 

ఈ నెల 9న ఆమ్మ ఒడి పథకాన్ని ప్రారంభిస్తున్నారు... కానీ ఆ డబ్బులు కూడా సక్రమంగా వేస్తారో లేదో డౌటేనన్నారు. ఫీజు రియంబర్స్‌మెంట్ బకాయిలను ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా కళాశాలలు చెల్లించలేదన్నారు. దీంతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ ఫీజులు బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారో ప్రకటించాలని సూచించారు.

read more  బాబూమోహన్ పై సంచలన వ్యాఖ్యలు: మంత్రులకు కేసీఆర్ వార్నింగ్ 

ఇలా అన్నదాతలు, విద్యార్థులే కాదు యావత్ రాష్ట్రం వైసిపి ప్రభుత్వ పాలనలో ఏదో ఒక విధంగా ఇబ్బందులకు గురవుతున్నారని ఆరోపించారు. కాబట్టి ముఖ్యమంత్రి జగన్ అనవసర విషయాలపై కాకుండా పాలనపై దృష్టిపెడితే మంచిదని హెచ్చరించారు. 


 

click me!