ఉత్తరాంధ్ర దెబ్బకు చంద్రబాబు విలవిల...ఇది అసలైన...: తమ్మినేని

By Arun Kumar PFirst Published Jan 11, 2020, 5:41 PM IST
Highlights

విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ రాజధాని రాకుండా మోకాలడ్డుపెడుతున్న మాజీ సీఎం, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబుకు ఉత్తరాంధ్ర సత్తాఏంటో చూపిస్తామని అసెంబ్లీ స్పీకర్  తమ్మినేని సీతారాం  హెచ్చరించారు. 

విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ను ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న తెలుగుదేశం అధ్యక్షులు చంద్రబాబు నాయుడికి ఉత్తరాంధ్ర దెబ్బను రుచి చూపిస్తామని శాసనసభాపతి తమ్మినేని సీతారాం హెచ్చరించారు. గతంలో కేవలం అమరావతి ప్రాంత ప్రజలు ఓటేయడం వలనే చంద్రబాబు సీఎం కాలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్దికి మోకాలడ్డు పెడుతున్న ఆయనను తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు ఆ ప్రాంత ప్రజలు సిద్దంగా వున్నారని అన్నారు.

వైసిపి ప్రభుత్వ నిర్ణయంతో ఎన్నో ఏళ్ల తమ కల నెరవేరుతుందని భావిస్తున్న సమయంలో చంద్రబాబు ఇలా అడ్డంకులు సృష్టించడం తగదన్నారు. విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేతకు అసలు ఉద్యమమంటే ఏంటో చూపిస్తామని స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

శనివారం ఉత్తరాంధ్ర ఫోరం అధ్వర్యంలో జరిగిన సమావేశంలో తమ్మినేని సీతారాం పాల్గొన్నారు. ఈ సమావేశంలో విశాఖకు రాజధాని రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న పార్టీలకు ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టిడిపికి వ్యతిరేకంగా, ప్రభుత్వ నిర్ణయానికి అనుకూలంగా ఉద్యమాన్ని నిర్మించేందకు అవసరమైన కార్యాచరణ రూపొందించినట్లు స్పీకర్ తమ్మినేని తెలిపారు. 

read more  మూడు రాజధానుల వెనకున్న రహస్యమిదే: నాదెండ్ల

ఆంధ్ర ప్రదేశ్ లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ది కోసం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో మంచి మద్దతు లభిస్తోంది. ఆ ప్రాంతాల్లో వైసిపి నాయకులు, కార్యకర్తలతో పాటు సామాన్య  ప్రజలు కూడా ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఈ క్రమంలో విశాఖపట్నంలోని వివిధ ప్రాంతాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ  శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి.  

అంతేకాకుండా విశాఖపట్నం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీమిలి నియోజకవర్గ పరిధిలో రాష్ర్ట మంత్రి అవంతి శ్రీనివాస్, వైసీపీ విశాఖ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ తో పాటు నియోజకవర్గ నేతలు, వైసిపి కార్యకర్తలు పాల్గొన్నారు.

గాజువాక నియోజకవర్గ పరిధిలో వైసీపీ శ్రేణులు టీఎన్ఆర్ కళ్యాణ మండపం నుంచి పాత గాజువాక వరకు భారీ ర్యాలీ నిర్వవహించారు. అలాగే విశాఖ నార్త్ నియోజకవర్గ ఇంచార్జి కేకే రాజు ఆద్వర్యంలో బిర్లా జంక్షన్ నుంచి గురుద్వార్ వరకు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు.

విశాఖ వెస్ట్ నియోజకవర్గ ఇంచార్జి, మాజీ ఎమ్మెల్యే మల్ల విజయప్రసాద్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు నియోజకవర్గ ఇంచార్జి అక్కరమాని విజయనిర్మల  ఆధ్వర్యంలో ఇసుకతోట నుంచి ఎంవీపి వరకు ర్యాలీ నిర్వహించారు. 

read more  సిబిఐ కోర్టుకు సీఎం... దృష్టి మరల్చడానికే ఆ కుట్ర: దేవినేని ఉమ

బీమిలి నియోజకవర్గ పరిధిలోని మంత్రి అవంతి  ఆధ్వర్యంలో భారీగా ర్యాలీ చేపట్టి సమావేశం నిర్వహించారు.  ఈ  సమావేశంలో మంత్రి మాట్లాడుతూ...విశాఖను పరిపాలనా రాజధానిగా ఏర్పాటు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరు స్వాగతిస్తున్నారని అన్నారు.వెనుకబడిన తమ ప్రాంత అభివృద్ది  కోసం సీఎం ప్రత్యేక  శ్రద్ద చూపించి ఈ నిర్ణయం తీసుకున్నారని...ఇందుకుగాను  ఆయనకు  కృతజ్ఞతలు  తెలుపుతున్నానని అవంతి అన్నారు.  
 

click me!