వేడెక్కిన ఇసుక రాజకీయం... చంద్రబాబు దీక్షా స్థలంలోనే వైసిపి ఎమ్మెల్యే దీక్ష

By Arun Kumar PFirst Published Nov 13, 2019, 3:36 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ లో ఇసుక రాజకీయాలు వేడెక్కాయి. భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు, ఇసుక కొరతను నిరసిస్తూ చంద్రబాబు విజయవాడలో దీక్ష చేపట్టేందుకు సిద్దమవగా వైసిపి ఎమ్మెల్యే ఒకరు అదే దీక్షాస్థలిలో  నిరసనకు సిద్దమయ్యారు. దీంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. 

తాడేపల్లి:  ఇసుక కొరతకు స్వయంగా కారకుడైన టిడిపి అధ్యక్షులు, గత ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఇసుక పేరుతో దీక్ష చేయడం విడ్డూరంగా వుందని వైసిపి అధికార ప్రతినిధి,పెనమలూరు ఎంఎల్ఏ కొలుసు పార్ధసారధి ఎద్దేవా చేశారు. ఇసుక కొరత తీరిపోయిందని తెలిసినా కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆయన దీక్ష చేస్తున్నారని అన్నారు.

తన ఇసుక కంపును ఇతరులపై రుద్దేందుకే చంద్రబాబు దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు పార్ధసారధి ఓ సవాల్  విసిరారు.  ఇవాళ సాయంత్రంలోపు తనపై చేసిన ఆరోపణలకు చంద్రబాబు ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. 

తాను ఎక్కడ ఇసుకను దాచానో, ఏం పనులు చేశానో, కృత్రిమ కొరత ఎలా సృష్టించానో నిరూపించాలని...-లేదంటే చంద్రబాబు దీక్ష చేస్తున్న ధర్నా చౌక్ లోనే తాను ధర్నాచేస్తానని సంచలన ప్రకటన చేశారు. ఈ సందర్భంగా పార్థసారధి విజయవాడ పోలీస్ కమీషనర్ కు కూడా తన దీక్షకు అనుమతించాలంటూ దరఖాస్తు చేసుకున్నారు.

read more  ఇసుక కృత్రిమ కొరత సాండ్ మాఫియా పనే...వీరి అండతోనే...: చంద్రబాబు

ఇసుకను దోచేసిన టిడిపి నేతలే తమపై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ చేసిన లక్షలకోట్ల అవినీతిని బయటపడకూడదనే ఉద్దేశంతో ఈ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అప్పట్లో టిడిపి ఎంఎల్ఏలకు దోచేసుకోమని ఇసుకరీచ్ లను అప్పగించారని ఆరోపించారు. 

చంద్రబాబు అండతో నాటి టిడిపి ఎంఎల్ఏలు, ఇతర నేతలు ఇసుక టన్నుల కొద్ది డంప్ చేసిన మాట వాస్తవం కాదా... అని ప్రశ్నించారు. వ్యవస్దలను నాశనం చేసి అవినీతికి పట్టం కట్టిన చరిత్ర చంద్రబాబుదని, తన తాబేదారు పవన కల్యాణ్ తో కలసి ఆయన కొత్త డ్రామాలు ఆడుతున్నారని అన్నారు.

రాష్ట్రంలోని కృష్ణా,  గోదావరి నదుల వరద వల్లే ఇసుక కొరత ఏర్పడిన మాట వాస్తవం కాదా... అని ప్రశ్నించారు.గతంలో చంద్రబాబు తన నివాసం పక్కనే ఇసుక అక్రమాలు తవ్వుతున్నప్పటికి చోద్యం చూసింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఆ అక్రమ తవ్వకాల వల్ల పర్యావరణం ప్రమాదంలో పడిందని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రూ.100 కోట్ల రూపాయల జరిమానా విధించింది వాస్తవం కాదా...? అని ప్రశ్నించారు.

read more  దోస్త్ మేరా దోస్త్: చంద్రబాబు దీక్షకు పవన్ మద్దతు, దీక్షకు జనసైనికులు

ఇసుక దోపిడీని అరికట్టడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నారన్నారు. ప్రస్తుతం ఇసుక ఎంత కావాలంటే అంత ఇసుకను పారదర్శకంగా సరఫరా చేస్తున్నామని, ఇసుకను డంపింగ్ యార్డులకు తరలించి రాష్ర్ట ప్రజలందరికి అందుబాటులోకి తెచ్చామని పార్థసారధి  పేర్కొన్నారు. 
 

click me!