టిడిపిని వీడకూడదనే అనుకున్నా... కానీ వారివల్లే...: దేవినేని అవినాశ్

By Arun Kumar PFirst Published Nov 14, 2019, 5:06 PM IST
Highlights

విజయవాాడ రాజకీయాల్లో మరో కీలక ఘట్టం ముగిసింది. గతకొంతకాలంగా టిడిపి యువ నాయకుడు దేవినేని అవినాశ్ అధికార వైసిపిలో చేరనున్నట్లు జరుగుతున్న ప్రచారం ఇవాళ(గురువారం) నిజమయ్యింది.  

విజయవాడ: "మన వ్యక్తిగత జీవితాల కన్నా , మనల్ని నమ్ముకుని ఉండే మనుషులు  ముఖ్యం .. వారి శ్రేయస్సు కోసం మనం ఎలాంటి అడుగు అయినా తీసుకోక తప్పదు'' అన్న తన నాన్న(దేవినేని నెహ్రూ) మాటలను అనుసరించే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు దేవినేని అవినాశ్ తెలిపారు. శ్రేయోభిలాశులు, అనుచరులు మరీ ముఖ్యంగా కార్యకర్తల అభీష్టం మేరకే తాను టిడిపిని వీడి వైసిపిలోకి చేరినట్లు అవినాశ్ పేర్కొన్నారు.  

తాను ఎవరిని కించపరిచేలా కానీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కానని... నమ్ముకున్న వాళ్ళ కోసం కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు పోరాడడం తన స్వభావమని అన్నారు.  ఒక వ్యక్తి  నాయకుడు అవ్వాలంటే అది ప్రజలు కార్యకర్తలు అండతోనే సాధ్యమన్నారు... అదే నాయకుడు ఒక అడుగు వేశాడంటే అండగా ఉన్న కార్యకర్తలు ప్రజల శ్రేయస్సు కోసమేనని అన్నారు. 

మీరు ఇచ్చిన బలం మీకే చెందుతుంది తప్ప ఎన్నడూ తన లాభాపేక్ష ఉండదని అవినాశ్ తెలిపారు. తనకు అండగా ఉన్న ప్రతి ఒక్కరికోసం కమిట్మెంట్ తో  పనిచేయడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తానని  అన్నారు.

 ఒక అడుగు వేసేటప్పుడు ఎన్నో కారణాలు ఉంటాయని..అదే విధంగా ఒక మాట అనేటప్పుడు అన్నీ ఆలోచించి అనాలన్నారు. కృష్ణా జిల్లాలో ఉన్న నాయకులను, కార్యకర్తలను వినియోగించుకోవడంలో తెలుగుదేశం పార్టీ విఫలం అయ్యిందన్నారు. పార్టీలో చేరినప్పటి నుండి  అధినాయకుడి మాటే .. నా బాట అని నమ్మి నిబద్ధతతో పని చేసానని...అందుకు ప్రతిఫలంగా కార్యకర్తలకు, నాయకులకు సముచిత స్థానం కల్పించమని చంద్రబాబును కోరానని అన్నారు.

read more  సీఎం జగన్ తో దేవినేని అవినాశ్ భేటీ... వైసిపీలో చేరిక

తనమీద నమ్మకంతో అప్పజెప్పిన ప్రతిబాధ్యతని నిజాయితీ, క్రమశిక్షణతో నిర్వహించానని...గత ఎన్నికల్లో అనువైన  స్థానం కాకపోయినా ఆయన ఆదేశాల  మేరకు గుడివాడ నుండి పోటీచేశానని తెలిపారు. ఓటమి బాధ కలిగించినా లెక్కచేయకుండా పార్టీ కోసమే ముందడుగేసానని... కానీ ఇన్నాళ్లుగా అనుక్షణం వెన్నంటి ఉన్న కార్యకర్తలకు, దేవినేని నెహ్రూ అనుచరులకు తగిన ప్రాధాన్యం దొరకకపోవడం బాధ కలిగించిందని ఆవేధన వ్యక్తం చేశారు. 

టిడిపిలోని కొంతమంది లోకల్ నాయకులు కావాలనే ఇదంతా చేస్తున్నా అధిష్టానం పట్టించుకోకపోవడం కార్యకర్తలకు రుచించలేదన్నారు. అలాగే తన నిబద్ధతను పార్టీ అధిష్ఠానం తేలికగా తీసుకుందని... కార్యకర్తల మనోభావాలను  పరిగణలోకి తీసుకోకుండా వారికి ప్రాధాన్యం కలిగించడ లో పూర్తిగా విఫలం అయిందన్నారు. 

ఈ రోజు తాను కానీ, నాన్న దేవినేని రాజశేఖర్ నెహ్రు గారు కానీయండి .. ఇలా ఉన్నాం అంటే అది కేవలం మమ్మల్ని నమ్ముకున్న కార్యకర్తలు, అభిమానుల వల్ల మాత్రమేనని... అలాంటి కార్యకర్తలకు ప్రాధాన్యం లేని చోట  ఉంటూ  ఆత్మవంచన చేసుకోవద్దని నిర్ణయించుకున్నానని తెలిపారు. అలాగే పార్టీలో కమిట్మెంట్ తో పని చేసే వారికి ప్రాధాన్యం లేకపోవడం, భజన చేసే వారికి అధిష్టానం వత్తాసు పలకడం మనసును ఎంతో గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు.

టిడిపిని వీడే ఉద్దేశం లేదని నేను ఎన్ని విధాలుగా చెప్పినా ఎప్పటికప్పుడు తన పార్టీ మారుతున్నానని వదంతులు పుట్టించి, అధిష్టాననానికి తన గురించి తప్పుడు సంకేతాలు వెళ్లేలా చేశారని... వాటిని గుర్తించకుండా పార్టీ పెద్దలు ఇంకా వారినే చేరదీస్తూ ఉండడంతో మనసు విరిగిపోయిందన్నారు. అందువల్లే పార్టీని వీడాలన్న కఠిన నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.

read more  టీడీపీకి దేవినేని అవినాష్ రాజీనామా

పార్టీ అందించిన ప్రతి పనినీ బాధ్యతగా నిర్వర్తించినా ఇటీవల తన విషయంలో పార్టీ తీసుకుంటున్న నిర్ణయాలు కేవలం ఒక్కడినే కాదు కార్యకర్తలు, అనుచరులను కూడా అయోమయానికి గురిచేస్తున్నాయని తెలిపారు. మొన్న గుడివాడ ఇంచార్జి అని...ఇటీవల గన్నవరం అంటున్నారని రేపు ఇంకెక్కడో .. ఇలా ప్రతిసారీ తాను మారినా కార్యకర్తలు కూడా మారాలంటే ఎలా ? అని ప్రశ్నించారు. 

స్థానికంగా బలపడుతున్న ప్రతీసారీ ఇలాంటి ఒడిదుడుకులు వస్తుంటే ఎక్కడ కుదురుకోవాలి ? ఎలా పార్టీని బలపరచాలి ? అందుకే ..కార్యకర్తలతో సుదీర్ఘంగా చర్చించిన మీదట పార్టీ వీడాలని నిర్ణయించుకున్నానని అన్నారు. తనను ఇంతకాలం ఆదరించిన చంద్రబాబు కుకృతఙ్ఞతలు... ఆయన మీద గౌరవం ఎప్పటికీ అలాగే ఉంటుందని అవినాశ్ పేర్కోన్నారు.

video news : ఎవరినీ అవహేళన చేసేలా మాట్లాడే వ్యక్తిని కాను

click me!