ఉపవాసంతో ఊపందుకునే ఉత్సాహం (వీడియో)

Oct 5, 2019, 11:40 AM IST

నవరాత్రి అంటే అంతటా కోలాహలమే..రంగుల వైభవమే. సంప్రదాయం, సంగీతం, నృత్యం అన్నింట్లోనూ ఎంతో ఆడంభరం కనిపించే పండుగ దసరా నవరాత్రులు. మానసిక, శారీరక విశ్రాంతిని, ప్రశాంతతను అందించే పండుగ..నూతనోత్సాహాన్ని పుంజుకునే పండుగ నవరాత్రి. మనలోకి మనం చేసే అంతర్గత ప్రయాణాన్ని ఆనందంగా, సంతోషంగా మార్చే శక్తి నవరాత్రి ఉపవాసం వల్ల కలుగుతుంది. 

ఒత్తిడిని తగ్గించి రోగనిరోధక శక్తిని పెంచే చక్కటి మార్గం ఉపవాసం. ఆకలివేయకముందే తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. ఇది చివరికి ఒత్తిడికి, రోగనిరోధక శక్తి తగ్గడానికి దారి తీస్తుంది. ఉపవాసం జీర్ణవ్యవస్థను తిరిగి కోలుకునేలా చేస్తుంది. దాంతో ఒత్తిడినుండి ఉపశమనం, రోగనిరోధకశక్తి పెరగడం జరుగుతాయి. 

ఉపవాసం మెదడులోని గందరగోళాన్ని తగ్గించడం వల్ల ధ్యానం చేసుకోవడానికి అవసరమైన ప్రశాంతత కుదురుతుంది. ఏదేమైనా ఉపవాసం సమయంలో శరీరానికి కావాల్సినంత  తాజా పండ్లు, సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఉత్సాహంగా ఉండగలుగుతారు.

ఉపవాసంతో కూడిన ధ్యానం మనలోని అంతర్గతశక్తులను మేల్కొలిపి ప్రశాంతత, సానుకూల దృక్పధం అనే సత్వ లక్షణాలను పెంపొందిస్తుంది. దీనివల్ల మెదడు మరింత శాంతిగా, చురుకుగా మారుతుంది. ఫలితంగా మన పూజలు, ఆశయాలు మరింత శక్తివంతంగా మారతాయి. సత్వ వల్ల లోపలి వికాసం జరిగి శరీరం తేలికగా, శక్తివంతంగా మారుతుంది. మానసికంగా, శారీరకంగా దేన్నైనా ఎదుర్కొనే బలాన్ని పుంజుకుంటాం. దీనివల్ల లక్ష్యసాధన మరింత సులభమవుతుంది.