రేపే సూర్యగ్రహణం: ఆ గుడి మాత్రం మూసేయరు, ఎందుకంటే...

By telugu teamFirst Published Dec 25, 2019, 8:35 AM IST
Highlights

రేపు సూర్యగ్రహణం పట్టనుంది. ఈ సందర్భంగా అన్ని ఆలయాలను మూసివేస్తుండగా ఏపీలోని ఓ ఆలయాన్ని మాత్రం మూసేయరు. ఆ ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా తెరిచే ఉంచుతారు. అదేమిటో తెలుసుకోండి.

చిత్తూరు: గురువారం ఉదయం సూర్యగ్రహణం పట్టనుంది. ఈ ఏడాది చివరి గ్రహణం ఇదే. ఈ గ్రహణం సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని గుడులన్నీ మూసివేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఓ గుడిని మాత్రం మూసేయరు. ఏ గ్రహణం పట్టినా కూడా ఆ గుడిని మూసేయరు. 

అమావాస్య, పౌర్ణమి, గ్రహణాలు, ఇతర ఏ కారణాలతో కూడా మూసేయని గుడి చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తి. శ్రీకాళహస్తిని దక్షిణ కైలాసంగా, వాయులింగేశ్వర క్షేత్రంగా కొలుస్తారు. దీన్ని గ్రహణం పట్టని ఆలయంగా కూడా పిలుస్తారు.

రేపు సూర్యగ్రహణం సందర్భంగా కూడా శ్రీకాళహస్తి ఆలయాన్ని తెరిచే ఉంచుతారు. ఆ ఆలయంలోని శ్రీకాళహస్తీశ్వరుడికి గ్రహణ సమయంలో అభిషేకాలు చేస్తారు. శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యచంద్రులు, అగ్ని భట్టారకుడు, నవగ్రహాలు, 27 నక్షత్రాలను నిక్షిప్తం చేసుకున్న కవచంతో భక్తులకు దర్శనమిస్తుంటాడని, అందువల్ల రాహుల, కేతువు ఈ ఆలయంలోకి ప్రవేశించలేవని విశ్వసిస్తారు. 

ఆ కారణంగానే శ్రీకాళహస్తిలో రాహు, కేతు, సర్పదోష నివారణ పూజలు చేయించుకుంటారు. సెలబ్రిటీలు కూడా ఇక్కడ అటువంటి పూజలు చేయించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గ్రహణ సమయంలో కూడా భక్తులను ఆలయంలోకి అనుమతిస్తారు. రేపు ఉదయం సూర్యగ్రహణం పట్టిన సమయంలో అభిషేకాలు నిర్వహిస్తారు.

click me!