ఈ నెల 8వ తేదీన వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకుని షర్మిల తన వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సిద్ధమయ్యారు. ఈలోగా షర్మిల తన పార్టీ జెండాను ఖరారు చేశారు.
హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల తెలంగాణ పార్టీ జెండా ఖరారైంది. వైఎస్సార్ తెలంగాణ పార్టీని ఆమె ఈ నెల 8వ తేదీన ప్రారంభించనున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆమె తన పార్టీకి శ్రీకారం చుడుతున్నారు. పార్టీ పేరును ప్రకటించి, ప్రారంభించడానికి వేదిక కూడా ఖరారైంది.
షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ జెండాను రాష్ట్ర పక్షి అయిన పాలపిట్ట రంగులో రూపొందించారు. జెండాలో 80 శాతం మేర పాలపిట్ట రంగు, మిగిల 20 శాతం నీలం రంగు ఉంటుంది. జెండాలో మధ్యలో తెలంగాణ తెలంగాణ భౌగోళిక స్వరూపం, అందులో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రం ఉండే విధంగా జెండాను రూపొందించారు.
వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని హైదరాబాదులోని ఫిలింనగర్ లో గల జేఆర్సీ సెంటర్ లో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం లోటస్ పాండులోని తన కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్ ను షర్మిల ఆవిష్కరిస్తారు.
ఈ నెల 8వ తేదీన పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను పూలతో అలకరించాలని వైఎస్ విగ్రహాల పరిరక్షణ కమిటీ కో ఆర్డినేటర్ నీలం రమేష్ పిలుపునిచ్చారు.