Telangana News: కేసీఆర్ మత్తులో హామీలిస్తాడు... నిద్రపోగానే మర్చిపోతాడు..: రైతు గోస దీక్షలో షర్మిల ధ్వజం

Arun Kumar P   | Asianet News
Published : Apr 20, 2022, 04:00 PM ISTUpdated : Apr 20, 2022, 04:04 PM IST
Telangana News: కేసీఆర్ మత్తులో హామీలిస్తాడు... నిద్రపోగానే మర్చిపోతాడు..: రైతు గోస దీక్షలో షర్మిల ధ్వజం

సారాంశం

వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల మహా ప్రస్థాన పాదయాత్ర ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇవాళ కరకవాగు గ్రామానికి చేరుకున్న షర్మిల రైతు గోస దీక్షలో పాల్గొన్నారు.

ఖమ్మం: వైఎస్సార్ టిపి అధినేత్రి వైఎస్ షర్మిల (ys sharmila) తెలంగాణ ప్రజల తెలుసుకుని వారికి మరింత దగ్గరయ్యేందుకు మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేపడుతున్నారు. ఆమె పాదయాత్ర (sharmila padayatra) దాదాపు రెండునెలలు (61రోజులు) పూర్తచేసుకుంది. ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం పరిధిలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కరకవాగు గ్రామానికి చేరుకున్న షర్మిల రైతు గోస దీక్షలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా టీఆర్ఎస్ పాలన, సీఎం కేసీఆర్ పై ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. 

''ఇంద్రవెల్లి ఘటన జరిగి నేటికి 42 యేళ్లు. పోడు భూముల కోసం పోరాడి చనిపోయిన ఆదివాసీలకు వైఎస్సార్ బిడ్డగా నివాళులు అర్పిస్తున్నా. 100ల ఏళ్లుగా పోడు భూములకోసం పోరాటం జరుగుతూనే ఉంది. ఆనాడు జల్, జంగల్, జమీన్ అని మొదలైన పోరాటం ఈ రోజు వరకు కూడా జరుగుతుంది'' అని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. 

''తమ భూములపై హక్కుల కోసం పోరాడుతున్న పేదల మీద ఇప్పుడు కూడా కేసులు పెడుతూనే ఉన్నారు. ఇదే ఖమ్మం జిల్లాలో 21 మంది మహిళలను లాఠీలతో కొట్టి జైల్లో పెట్టారు. కాళ్ళు పట్టుకుంటే తప్పా మంచినీళ్ళు కూడా ఇవ్వలేదు. ఇది ఎప్పుడో కాదు కేసీఆర్ పాలనలో జరిగిన ఘోరమే'' అని ఆవేదన వ్యక్తం చేసారు. 

''పోడు భూముల సమస్యలను పరిష్కరించింది కేవలం వైఎస్సార్ మాత్రమే. ఆయనే ఈ ఖమ్మం జిల్లాలో ఏకంగా లక్షా90 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే మిగతా భూములకు పట్టాలు వచ్చేవి. దురదృష్టవశాత్తు ఆయన ప్రమాదంతో మరణించారు. ఆ తర్వాత ఒక్క ఎకరాకు కూడా పట్టా ఇవ్వలేదు'' అన్నారు. 

''ఎన్నికలప్పుడు కేసీఆర్ పోడు భూముల సమస్య పరిష్కారం అన్నాడు.  కుర్చీ వేసుకొని కూర్చొని సమస్యను పరిష్కారిస్తానని అన్నాడు. కానీ అధికారంలోకి వచ్చి ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు కేసీఆర్ ఆ సమస్యను పరిష్కరించలేదు. కేసీఆర్ కి చిత్తశుద్ది లేదు... అందుకే పరిష్కరించేందుకు చేతకావడం లేదు. ఈ పాపం ఆయనకు తప్పకుండా తగులుతుంది'' అని మండిపడ్డారు. 

''ప్రజలు కష్టాల్లో వుంటే సీఎం భోగాలు అనుభవిస్తున్నాడు. కేసీఆర్ దృష్టిలో అసలు తెలంగాణలో సమస్యలు లేవు. ఆయన మత్తులో పూటకో మాట మాట్లాడతాడు. ఒకసారి వడ్లు కొన అంటాడు... మళ్ళీ రాజకీయాల కోసం నేనే కొంటా అంటాడు. మిర్చికి నష్ట పరిహారం అంటాడు... ఇచ్చిన మాట మరిచిపోతాడు. బయట మాట్లాడతాడు... ఇంటికి వెళ్ళి నిద్రపోయి మరిచిపోతాడు.  కేసీఆర్ మాట అస్సలు నమ్మలేం'' అని మండిపడ్డారు. 

''కేసీఆర్ ఒక్క తప్పుడు సంతకం వల్ల కేంద్రం మన వడ్లు కొనమని అంటోంది. ఢిల్లీకి వెళ్లి తెలంగాణ రైతుల పక్షాన కేంద్రంతో పోరాడుతానని చెప్పిన కేసీఆర్ చేతులు ఊపుకుంటూ ఖాళీగా రాష్ట్రానికి వచ్చాడు. రాష్ట్రమే వడ్లు కొంటుందని చెప్పి ఈ రోజు వరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కొంటామని చెప్పి ఎందుకు కేంద్రాలు తెరవలేదు?'' అని షర్మిల ప్రశ్నించారు. 

''రాజకీయాల కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నాడు. వడ్లు కొనాలనే ఉద్యేశ్యమే కేసీఆర్ కి లేదు. వడ్లు కొంటానని చెప్పి 500 వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసారు. కానీ అందులో కేవలం 30 కేంద్రాల దగ్గరే వడ్లు కొంటున్నారు. మిగతా కొనుగోలు కేంద్రాలు తెరిచిన పాపాన పోలేదు'' అని మండిపడ్డారు. 

''పోలీస్ వ్యవస్థ ఉన్నది ప్రజలకు రక్షణ కల్పించడం కోసమే... కానీ అధికార టీఆర్ఎస్ తమ పార్టీ రక్షణ కోసం పోలీసులను పనోల్లుగా పెట్టుకుంది. ఇలా పాలక పక్షం ప్రజలను గాలికి వదిలేసింది. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోవాలి'' అని షర్మిల హెచ్చరించారు. 

''టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు కూడా పాలకపక్షం పంచన చేరాయి. అందువల్లే మా నాయన పేరు మీద ఈ పార్టీ పెట్టాను. పార్టీ పేరులోనే కాదు పార్టీ జెండాలో మా నాయన ఉన్నాడు. మీరు ఆశీర్వదిస్తే తిరిగి వైఎస్సార్ పాలన తిరిగి తెస్తా'' అని షర్మిల పేర్కొన్నారు. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Hyderabad: ఇరాన్‌లో యుద్ధం... హైద‌రాబాద్‌లో పూరీ, దోసెలు బంద్ చేస్తున్న హోట‌ళ్లు. అస‌లేంటీ లాజిక్
Kavitha Hunger Strike for Velugumatla Displaced Families in Hyd, Telangana | Asianet News Telugu