తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టేందుకు వైఎస్ షర్మిల సూచనప్రాయంగా నిర్ణయం తీుసకున్నట్లు తెలుస్తోంది. తన పార్టీ పేరును కూడా ఆమె ఇప్పటికే ఖరారు చేసుకున్నట్లు ప్రచారం సాగుతోంది.
హైదరాబాద్: తెలంగాణలో పాగా వేయాలని ముందుకు వస్తున్న వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పేరు కూడా ఖరారైనట్లు ప్రచారం జరుగుతోంది. వైఎస్సార్ టీపీ అని పార్టీ పెట్టనున్నట్లు తెలుస్తోంది. టీపీ అంటే తెలంగాణ పార్టీ అని అనుకోవడానికి వీలుంది. అయితే, వైఎస్సార్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అని ఉంటుందా, మరోటి ఉంటుందా అనేది చూడాలి.
తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించాలని ఆమె సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా ఇప్పటికే ఆమె ఎన్నికల కమిషన్ ను సంప్రదించినట్లు చెబుతున్నారు. మంగళవారం జరుగుతున్న ఆత్మీయ సమావేశంలో షర్మిలతో పాటు ఆమె భర్త అనిల్ కూడా పాల్గొన్నారు.
అయితే, ఆమె తక్షణమే రాజకీయ పార్టీని ప్రకటించకపోవచ్చునని అంటున్నారు మార్చిలో ఆమె పార్టీని ప్రారంభిస్తారని, అప్పుడే ప్రకటన చేస్తారని సమాచారం. తెలంగాణలోని ప్రముఖ రాజకీయ నాయకులతో, ముఖ్యంగా గతంలో వైఎస్ కు సన్నిహితంగా పనిచేసిన నాయకులతో ఆమె చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఆమె ప్రస్తుతం ప్రాధాన్యం ఇస్తున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే ఆమె ఆత్మియ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని అంటున్నారు. తొలుత ఆమె నల్లగొండ జిల్లాకు చెందిన వైఎస్ అభిమానులతో సమావేశమయ్యారు. నాగార్జున సాగర్ శాసనసభా నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనున్న నేపథ్యంలో షర్మిల ఆత్మీయ సమావేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఆమె జాతీయ పార్టీని స్థాపిస్తారని ఇంతకు ముందు చెబుతూ వచ్చారు. కానీ పక్కాగా తెలంగాణ కోసమే ఆమె పార్టీ పెడుతున్నట్లు తెలుస్తోంది. షర్మిలను కలిసేందుకు మంగళవారం పెద్ద యెత్తున ప్రజలు కదిలి వచ్చారు.