
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ ఎండకు ఆ గొడుకు పట్టే రేవంత్ రెడ్డికి వైఎస్సార్ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. రేవంత్ ఓటుకు నోటుకు దొంగ అని.. వైఎస్ పాలన తెస్తా అంటూ కొత్త జపం చేస్తున్నాడని విమర్శించారు. చంద్రబాబు ఎంగిలి మెతుకుల కోసం వైఎస్సార్ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? అని ప్రశ్నించారు. వైఎస్సార్ మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగాకోరు కాదా? అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఆయనను జనాలు నమ్మడం లేదని.. మహానేత వైఎస్సార్ పేరును వాడుకుంటున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డికి వైఎస్సార్ అభిమానులే బుద్ది చెబుతారని అన్నారు. ఈ మేరు వైఎస్ షర్మిల ట్విట్టర్లో వరుస పోస్టులు చేశారు.
‘‘మహానేత వైఎస్సార్ పాలన తెస్తా అంటూ ఓటుకు నోటు దొంగ కొత్త జపం చేయడం హాస్యాస్పదం. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకుల కోసం ఆనాడు వైఎస్సార్ను ఆజన్మ శత్రువు అన్నది ఈ దొంగ కాదా? మహానేత మరణిస్తే పావురాలగుట్టలో పావురం అంటూ హేళన చేసింది ఈ దగా కోరు కాదా? ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రేవంత్కు వైస్సార్ మాట్లాడే నైతిక హక్కు లేదు. పులి తోలు కప్పుకున్నంత మాత్రానా నక్క పులి కాదు. అద్దెకు తెచ్చుకున్న ఉద్దెర లీడర్ రేవంత్ రెడ్డి. కారులో తిరుగుతూ ఆట విడుపులా పాదయాత్ర చేస్తూ పాదయాత్ర అనే పదాన్ని అపహాస్యం చేస్తున్నాడు. ఇలాంటి ప్రబుద్ధుడు ఊరూరా తిరిగి పొర్లు దండాలు పెట్టినా జనం నమ్మరు.
ఓటుకు నోటు దొంగను జనాలు నమ్మడం లేదని, మహానేత పేరును వాడకుంటున్న రేవంత్కు వైఎస్సార్ అభిమానులే బుద్ధి చెప్తారు. వైఎస్సార్ సంక్షేమ పాలన కోసం పుట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్ తెలంగాణ పార్టీ. ఆ మహానేత ఆశయ సాధన కోసం 3,800 కి.మీ. పాదయాత్ర చేసి, ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేసింది వైఎస్సార్ బిడ్డ మాత్రమే’’ అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.