పేపర్ లీక్.. గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు , ఇక ప్రభుత్వోద్యోగం రాదన్న బాధతో యువకుడు ఆత్మహత్య

By Siva KodatiFirst Published Mar 17, 2023, 9:42 PM IST
Highlights

గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడంతో సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆరేళ్లుగా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నవీన్.. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్ధితి లేదంటూ జీవితంలో విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డాడు. 

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ ఘటన లక్షలాది మంది ఆశల్ని చిదిమేసింది. ఈ క్రమంలో ప్రభుత్వం గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేయడంతో దానిపై ఎన్నో ఆశలు పెట్టుకున్న అభ్యర్ధుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లాలో నవీన్ అనే అభ్యర్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరేళ్లుగా గ్రూప్స్ కోసం ప్రిపేర్ అవుతున్న నవీన్.. ఇక ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చే పరిస్ధితి లేదంటూ జీవితంలో విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డాడు.  ఈ మేరకు సూసైడ్ నోట్‌లో తన ఆవేదనను పంచుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు నవీన్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

కాగా.. పేపర్ లీక్ నేపథ్యంలో టీఎస్‌పీఎస్సీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే జరిగిన పరీక్షలు సహా మొత్తం గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించింది. జూన్ 11న మళ్లీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్, ఏఈఈ, డీఏవో పరీక్షలు రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. ఏఈఈ, డీఏవో పరీక్షలు మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనే దానిపై తర్వాత నిర్ణయం తీసుకుంటామన్నారు. గతేడాది అక్టోబర్ 16న జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇవి కాకుండా త్వరలో నిర్వహించాల్సి వున్న మరిన్ని పరీక్షలను వాయిదా వేసే యోచనలో కమీషన్ వుంది.

ALso REad: పేపర్ లీక్ కేసు.. రాజశేఖరే ప్రధాన సూత్రధారి, ఉద్దేశ్యపూర్వకంగానే టీఎస్‌పీఎస్సీకి : సిట్ నివేదికలో కీలకాంశాలు

ఇదిలావుండగా.. పేపర్ లీక్ ఘటనకు సంబంధించి కమీషన్‌కు సిట్ నివేదిక అందజేసింది. ఈ కేసులో కీలక సూత్రధారి రాజశేఖరేనని.. అతను ఉద్దేశపూర్వకంగానే డిప్యూటేషన్‌పై టీఎస్‌పీఎస్సీకి వచ్చినట్లు సిట్ నిర్ధారించింది. ఇతను టెక్నికల్ సర్వీస్ నంచి డిప్యూటేషన్‌పై వచ్చాడు. అనంతరం ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌గా వున్న ప్రవీణ్‌తో సంబంధాలు కొనసాగించాడు రాజశేఖర్. ఇక్కడ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌గా వున్న రాజశేఖర్ కంప్యూటర్ హ్యాక్ చేసి పాస్‌వర్డ్‌ను దొంగతనం చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే పాస్‌వర్డ్‌ను తాను ఎక్కడా రాయలేదని శంకర్ లక్ష్మీ చెబుతోంది. కానీ శంకర్ లక్ష్మీ చెప్పిన దానితోనే అతను కంప్యూటర్ హ్యాక్ చేసినట్లు నిర్ధారించారు. 

అనంతరం పెన్‌డ్రైవ్ ద్వారా 5 ప్రశ్నాపత్రాలను కాపీ చేసి దానిని ప్రవీణ్‌కు ఇచ్చాడు. అనంతరం ఏఈ పరీక్షా పత్రాన్ని రేణుకకు అమ్మాడు ప్రవీణ్. ఈ క్రమంలో ఫిబ్రవరి 27నే పేపర్ లీకైనట్లు సిట్ గుర్తించింది. తొలుత గ్రూప్ 1 పరీక్షా పత్రం లీకైనట్లు తేల్చింది. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంతో సిట్ విచారణ జరిపింది. కమీషన్ సెక్రటరీ దగ్గర పీఏగా పనిచేస్తూ ప్రశ్నాపత్రాన్ని కొట్టేసినట్లుగా సిట్ నిర్ధారించింది. మరోవైపు పేపర్ లీక్ కేసులో నిందితులకు న్యాయస్థానం ఆరు రోజుల కస్టడీ విధించింది. ఈ కేసులో ఇప్పటి వరకు 9 మందిని సిట్ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో రేపటి నుంచి ఈ నెల 23 వరకు నిందితులను సిట్ కస్టడీకి అప్పగిస్తూ న్యాయస్ధానం ఆదేశాలు జారీ చేసింది. 

click me!