టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు .. బీజేపీ అభ్యర్ధి విజయం, అమిత్ షా ఏమన్నారంటే..?

By Siva KodatiFirst Published Mar 17, 2023, 7:07 PM IST
Highlights

మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి విజయం సాధించడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని ఈ విజయమే చెబుతోందని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 

తెలంగాణలో జరిగిన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. మహబూబ్‌నగర్ - రంగారెడ్డి - హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ మద్ధతున్న ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. దీంతో కాషాయ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. దీనిపై బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ట్వీట్ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించిన ఏవీఎన్ రెడ్డికి, ఆయన కోసం పనిచేసిన బీజేపీ శ్రేణులకు అమిత్ షా అభినందనలు తెలిపారు. తెలంగాణ ప్రజలు అవినీతితో విసిగిపోయారని ఈ విజయమే చెబుతోందన్నారు. 

ఇదిలావుండగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ హోరా హోరీగా సాగింది. గురువారం అర్ధరాత్రి దాటాక వెలువడిన ఫలితాల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఏవీఎన్‌ రెడ్డి గెలుపొందారు. తన సమీప అభ్యర్థి పీఆర్‌టీయూటీఎస్‌ అభ్యర్థి గుర్రం చెన్నకేశవరెడ్డిపై సుమారు 1,150 ఓట్ల తేడాతో గెలుపు పొందారు.

ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అధ్యంతం ఉత్కంఠగానే సాగింది. గురువారం అర్ధరాత్రి 1.40 గంటల వరకు ఎన్నికల లెక్కింపు జరిగింది.  మొదటి ప్రాధాన్య ఓట్ల లెక్కింపులో ఫలితం తేలలేదు. ఏ పార్టీ అభ్యర్థికీ సరైన మెజార్టీ రాలేదు. అంటే 50 శాతం మించి ఓట్లు పడలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపును ప్రారంభించారు. మూడో స్థానంలో ఉన్న టీఎస్‌యూటీఎఫ్‌ అభ్యర్థి పాపన్నగారి మాణిక్‌రెడ్డికి వచ్చిన 6,079 ఓట్లను రెండో ప్రాధాన్యత ఆధారంగా మొదటి రెండు స్థానాల్లోని అభ్యర్థులకు సర్దుబాటు చేయడంతో ఏవీఎన్‌ రెడ్డి విజయం ఖరారైంది. వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.

 

Congratulations to Shri AVN Reddy, and for the historic victory in Mahbubnagar-Rangareddy-Hyd Teachers' MLC polls.

This victory shows that Telangana people are fed up with corruption and want a pro-poor, transparent govt under Modi Ji's leadership.

— Amit Shah (@AmitShah)
click me!