నిజామాబాద్ లో విషాదం... ప్రియుడు పెళ్లికి అంగీకరించలేదని యువతి సూసైడ్

By Arun Kumar PFirst Published May 22, 2023, 1:15 PM IST
Highlights

వేరే మతానికి చెందిన యువకున్ని ప్రేమించి మోసపోయిన యువతి సూసైడ్ చేసుకున్న విషాదం నిజామాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. 

నిజామాబాద్ : ప్రేమించుకోడానికి అడ్డురాని మతాలు పెళ్లికి మాత్రం అడ్డొచ్చాయి. ఇద్దరి మతాలు వేరు కావడంతో ప్రాణంగా ప్రేమించినవాడు పెళ్ళికి అంగీకరించపోవడం యువతి తట్టుకోలేకపోయింది. ప్రియుడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్న యువతి ఆశలు ఆవిరవడంతో దారుణ నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఒంటరిగా వుండగా ప్రేమ, పెళ్లి గురించి ఆలోచిస్తూ డిప్రెషన్ లో సూసైడ్ చేసుకుంది. ఈ విషాద ఘటన నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.
 
వివరాల్లోకి వెళితే... నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన హరిణి(23) అదే గ్రామానికి చెందిన అక్తర్ ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించి వాడితోనే జీవితాంతం కలిసి బ్రతకాలని హరిణి భావించింది. దీంతో పెళ్లి చేసుకోవాలంటూ అక్తర్ పై ఒత్తిడి చేయడం ప్రారంభించింది. కానీ ప్రేమించినన్ని రోజులు మతాల ప్రస్థావన తీసుకురాని అక్తర్ పెళ్లి చేసుకోవాలని అడిగేసరికి అవి గుర్తుచేసాడు. ఇద్దరి మతాలు వేరు కాబట్టి పెద్దలు పెళ్లికి అంగీకరించరని... వారిని ఎదిరించి పెళ్లి చేసుకోలేనని తేల్చి చెప్పేసాడు.

ప్రాణంగా ప్రేమించిన ప్రియుడు పెళ్లికి నిరాకరించేసరికి హరిణి తట్టుకోలేకపోయింది. ప్రియుడికి దూరమై బ్రతకలేక బలవన్మరణానికి పాల్పడింది. నిన్న(ఆదివారం) ఇంట్లో ఎవరూలేని సమయంలో సీలింగ్ ఫ్యాన్ కు బెడ్ షీట్ తో ఉరేసుకుని హరిణి ఆత్మహత్య చేసుకుంది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తించారు. కూతురు మృతదేహాన్ని పట్టుకుని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

Read More  ఒంటరి మహిళతో తాగుబోతు యువకుల వెకిలిచేష్టలు... కాపాడిన బస్సు డ్రైవర్

హరిణి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తమ బిడ్డ సూసైడ్ కు కారణమైన అక్తర్ ను కఠినంగా శిక్షించాలని బాధిత తల్లిదండ్రులు, బంధువులు పోలీసులను కోరుతున్నారు. 

click me!